తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ తీరు, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల రేటు 1.17 శాతానికి తగ్గిందని, ప్రతి 10 లక్షల జనాభాకు 3,150 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరిందన్నారు. గత 24 గంటల్లో 8,338మంది శాంపిల్స్ పరీక్షించగా.. అందులో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని చెప్పారు. కొత్తగా 45 మంది డిశ్చార్జ్ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 887కి చేరిందని వివరించారు.