కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
తాడేపల్లి: భూసేకరణ సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఎవరి ఉసురూ తగలకూడదు. నా మాటగా చెబుతున్నా. భూ సేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారిని సంతోష పెట్టి భూమిని తీసుకోవాలి. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలి. ఫలానా కలెక్టర్ అన్యాయంగా తీసుకున్నాడు.. అనే మాట నాకు ఎక్కడా వినిపించకూడదు’అంటూ 13 జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం జగన్ పేర్కొన్నారు.