పేదలకు వెల్ఫేర్‌.. చంద్రబాబుకు ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌

25 Mar, 2022 15:15 IST

అసెంబ్లీ: ‘‘ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ మూడు సంవత్సరాల్లో 95 శాతం వాగ్దానాలతో పాటు, నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యమిస్తూ మన పాలన సాగింది. కరోనా వచ్చి ఆదాయాలు తగ్గినా కూడా మన సంకల్పం చెదరలేదు, మన దీక్ష మారలేదు, ప్రజలకు మనం చేస్తున్న మంచి తగ్గనూ లేదు. ప్రజలకు ఏమీ చేయడం లేదని, ఏదీ అందడం లేదని విమర్శించే అవకాశాన్ని కూడా ప్రతిపక్షానికి ఇవ్వలేదు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుందో.. రాష్ట్రంలోని ప్రతి రైతన్నను అడిగినా, స్కూల్‌ పిల్లవాడిని, పాపను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను ఎవరిని అడిగినా చెబుతారని, సంతోషం వారి కళ్లల్లోనే కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల క్యాలెండర్‌ పేదలకు వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే.. చంద్రబాబు ఫేర్వెల్‌ క్యాలెండర్‌ అవుతుందన్నారు. 

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2022–23 బడ్జెట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శాసనసభలో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్‌ను శాసనసభ సాక్షిగా సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

మనది ప్రజల బడ్జెట్‌. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. సహజంగా ప్రతిపక్షాలన్నీ బడ్జెట్‌ అంటే అంకెల గారడీ అని విమర్శించడం సర్వసాధారణం. కానీ, ఈ మూడు సంవత్సరాల పాలన, బడ్జెట్‌ ఏ ఒక్కరు చూసినా.. మన ఆచరణే మాట్లాడుతుంది. ప్రజలంతా జరుగుతున్న మంచిని గమనించారు కాబట్టే 2019 ఎన్నికల తరువాత కూడా ప్రతి ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వాన్ని మరింత అక్కున చేర్చుకున్నారు. 

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు చాలామంది మనవెంటే ఉన్నారు. ప్రతిపక్షం తన ఉనికి కోసం లేని సమస్యను ఉన్నట్టుగా చిత్రీకరించి, వక్రీకరించి రోజూ డ్రామాలు, కథలు చేయడమే కాకుండా.. వారి ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వారి కడుపుమంటను ప్రతి సందర్భంలోనూ చూపిస్తున్నారు. 

మూడు సంవత్సరాల్లో అక్షరాల 95 శాతం వాగ్దానాలు అమలుతో పాటు, నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యమిస్తూ పాలన సాగింది. కరోనా వచ్చినా కూడా ఆదాయాలు తగ్గినా కూడా సంకల్పం చెదరలేదు, దీక్ష మారలేదు, ప్రజలకు చేస్తున్న మంచి తగ్గనూ లేదు. ప్రజలకు ఏమీ చేయడం లేదని, ఏదీ అందడం లేదని విమర్శించే ఏ అవకాశాన్ని కూడా ప్రతిపక్షానికి ఇవ్వలేదు. చంద్రబాబు వారి పాలనలో ఫలానా బాగుందని చెప్పే సాహసం.. 44 ఏళ్ల రాజకీయ అనుభవం, 14ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మనిషికి ఏ కోశాన లేదు. 

ఈ సంవత్సరం దాదాపుగా రూ.55 వేల కోట్లు నేరుగా డీబీటీ విధానంలోనే లబ్ధిదారులకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. పరోక్షంగా ఇచ్చేది మరో రూ.17,305 కోట్లు. దేశ చరిత్రలోనే ఇలాంటి డీబీటీని, పారదర్శక పాలనను ఎక్కడా, ఎవరూ కూడా ఇవ్వడం లేదని సగర్వంగా తెలియజేస్తున్నాను. మనం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూడా ఎప్పుడు, ఏ నెలలో ఇస్తున్నామనేది ఎలాంటి సందేహాలకు తావులేకుండా, లబ్ధిదారులు కూడా మెరుగ్గా వారి కుటుంబ అవసరాలను ప్లాన్‌ చేసుకునే వీలును కల్పిస్తూ.. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా సోషల్‌ ఆడిట్‌ పెట్టి.. ఎలాంటి లంచాలు, వివక్షకు తావులేకుండా.. ఏ నెలలో ఏ స్కీమ్‌ వస్తుందో కూడా చెబుతూ ఏకంగా క్యాలెండర్‌ను విడుదల చేసి ఆ ప్రకారంగా క్రమం తప్పకుండా అమలు చేస్తూ.. ప్రజలకు భరోసానిస్తున్న ప్రభుత్వం మనది. 

పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడా కులం, మతం, ప్రాంతం, చివరకు రాజకీయ పార్టీ కూడా చూడలేదు. అందరూ మనవాళ్లే.. అందరూ నా వాళ్లే అని గట్టిగా నమ్మి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక సామాజికవర్గం తనకు తాను బాగుండేలా మన ప్రభుత్వంలో నవరత్నాల పేరిట పలు పథకాలను అమలు చేస్తున్నాం. ఈ పథకాల అమలు ఎలా జరుగుతుందో.. మన రాష్ట్రంలోని ప్రతి రైతన్నను అడిగినా, స్కూల్‌ పిల్లవాడిని, పాపను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను అడిగినా చెబుతారు. సంతోషం వారి కళ్లల్లోనే కనిపిస్తుంది. 

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మార్చి 2023 వరకు మనందరి ప్రభుత్వం వివిధ డీబీటీల ద్వారా ఏ పథకం ఏ నెలలో అందబోతుందో వివరిస్తూ గౌరవ సభ సాక్షిగా సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాను. 

ఏప్రిల్‌ మాసంలో..
- వసతి దీవెన 
- పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు ఇచ్చే కార్యక్రమం. 

మే మాసంలో..
- విద్యా దీవెన (జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి)
- అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌ ఖరీఫ్‌ 2021, 
- వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం 
- మత్య్సకార భరోసా (వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10 వేలతో పాటు డీజిల్‌ సబ్సిడీ అందజేయనున్నాం)

జూన్‌ మాసంలో..
- అమ్మ ఒడి పథకం. ఈ ఒక్క పథకానికే రూ.6500 కోట్లు.

జూలై మాసంలో..
- విద్యా కానుక
- వాహన మిత్ర 
- కాపు నేస్తం 
- జగనన్న తోడు
- సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్నవారికి ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్‌లో అవకాశం ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మిగిలిపోయిన అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం. 

ఆగష్టు మాసంలో..
- విద్యా దీవెన 
- ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌ 
- నేతన్న నేస్తం

సెప్టెంబర్‌ మాసంలో ..
- వైయస్‌ఆర్‌ చేయూత. ఈ ఒక్క పథకం ద్వారా బటన్‌ నొక్కిన వెంటనే దాదాపుగా 25 లక్షల మందికి మేలు చేస్తూ రూ.4500 కోట్లు విడుదల చేయనున్నాం.

అక్టోబర్‌ మాసంలో..
- వసతి దీవెన
- రైతు భరోసా 

నవంబర్‌ మాసంలో..
- విద్యా దీవెన మూడవ విడత
- రైతులకు వడ్డీలేని రుణాలు

డిసెంబర్‌ మాసంలో.. 
- ఈబీసీ నేస్తం
- లా నేస్తం పథకాలు
- సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్నవారికి ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్‌లో అవకాశం ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మిగిలిపోయిన అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం. 

జనవరి మాసంలో..
- రైతు భరోసా మూడవ విడత
- వైయస్‌ఆర్‌ ఆసరా దాదాపుగా 79లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ రూ.6700 కోట్లు అందించనున్నాం. 
- జగనన్న తోడు
- జనవరి మాసంలోనే పెన్షన్‌ రూ.2500 నుంచి రూ.2750కి పెంచి అందజేస్తాం.

ఫిబ్రవరి మాసంలో.. 
- విద్యా దీవెన నాల్గవ విడత
- జగనన్న చేదోడు పథకాలు

మార్చి మాసంలో.. 
- వసతి దీవెన అమలు 

ఇది రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర నిరుపేద వర్గాలకు ఇది వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే.. చంద్రబాబుకు తనకు ఢంకా మోగించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కి మాత్రం రుచించని క్యాలెండర్‌. గుబులుపుట్టించే క్యాలెండర్‌. ఇది మన పేదలకు వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే.. చంద్రబాబుకు ఫేర్వెల్‌ క్యాలెండర్‌ అవుతుంది.