ఈ నెల 31 వరకూ సకలం బంద్
తాడేపల్లి: కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు సకలం బంద్ పాటించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు ఇవాళ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే ఈ నెల31వ తేదీ వరకు బంద్ పాటిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమయంలో రవాణా వ్యవస్థను కట్టడి చేస్తున్నామని, పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తూ, ప్రతి ఇంటికి రూ.1000 ఆర్థికసాయం అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వైయస్ జగన్ మాటల్లోనే..
గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం మొత్తం సురక్షిత స్థానంలో నిల్చోని ఉండటానికి తోడ్పడిన ప్రతి గ్రామ వాలంటీర్కు, మెడికల్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, డాక్టర్లు, సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్, కలెక్టర్లు, అధికారులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దేవుడి దయతో మిగిలిన రాష్ట్రల కంటే మన రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని గర్వంగా చెప్పవచ్చు. దేశం మొత్తం మీద 4035 కేసులు నమోదు అయితే..ఐదు మంది చనిపోయారు. మన రాష్ట్రంలో కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. వీటిలో ఒక కేసు నయం అయ్యింది. డిచార్జ్ కూడా చేశారు. దాదాపుగా రెండు లక్షల యాభై వేలకు పైగా ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయడం, వాళ్లకు ఉన్న యాప్ ద్వారా ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే డేటాను నమోదు చేసి వివరాలు అందజేయడం, గ్రామ సెక్రటరీయట్లో ఉన్న సిబ్బంది యాక్టివ్గా ఉంటూ అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్రంలో 11,670 మంది విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడమే కాకుండా వారికి అవగాహన కల్పించాం. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక వంద పడకల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో 200 పడకల ఐసోలేషన్ వార్డుకు చర్యలు చేపట్టాలని ఆదేశించాం. ఎవరికి కూడా గొంతు నొప్పి, జర్వం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే మొట్ట మొదటిగా విదేశాల నుంచి వచ్చిన వారితో ఎదైనా సంబంధం ఉందా అన్నది సమీక్షించుకోవాలి. 104కు సమాచారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్ సంస్థలకు హాలీడేస్ ఇచ్చాం. 31వ తేదీ వరకు సెలవులు ఇచ్చాం. పదో తరగతి పరీక్షలు యధాతథంగా జరుగుతాయి.
ఇవన్నీ జరుగుతుండగానే దేశం మొత్తం మీదా దీన్ని శాశ్వతంగా అరికట్టాలనే దానిపై చర్చ జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో కూడా అవగాహన పెరగాలి. ఇంకొకరికి వ్యాధి సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతిఒక్కరూ నిర్ధిష్టమైన ప్రాంతంలో ఉండగలిగితే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. మనం కూడా 31వ తేదీ వరకు సకలం బంద్ చేద్దాం. ఇందులో భాగంగానే మనం కూడా రవాణా వ్యవస్థను కట్టడి చేస్తాం. అందరూ కూడా సహకరించుకోవాలి. ఆటోలు, ట్యాక్సీలు కూడా తప్పనిసరి అయితేనే ఉపయోగించుకోవాలి. ఇద్దరి కంటే కూడా ఎక్కువగా ఎక్కించుకోవద్దని సూచిస్తున్నాం. గోల్డ్ షాపులు, బట్టల షాపులు అన్నీ కూడా మార్చి 31 వరకు మూత వేయాలి. ఫ్యాక్టరీలు, గోడౌన్లు కూడా అవసరమైతేనే నడపండి. ప్రభుత్వం కూడా రోటేషన్ పద్ధతిలో ఉద్యోగులను వాడుకుంటాం. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ కూడా అభ్యర్థిస్తున్నా..హోం క్వారైంటన్లోకి 14 రోజుల పాటు వెళ్లాలి. బయటకు రావద్దు. ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాలు సరిహద్దులు మూసివేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు కూడా ప్రజలు బంద్ పాటించాల్సిన అవసరం ఉంది. ఇళ్ల వద్దే ఉండాలని కోరుతున్నాం. మరీ అవసరమైతేనే బయటకు రండి. వచ్చినప్పుడు కూడా రెండు మీటర్ల దూరాన్ని పాటించాలి. ఒకరికి ఒకరం అర్థం చేసుకోవాలి. అందరూ సహకరించాలని కోరుతున్నా.పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కట్టడి కావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. పోలీసులు కూడా చెబుతున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారికి కట్టడి చేయమని కోరుతున్నాం. కలెక్టర్లు అందరూ కూడా ధరలు పెరగకుండా చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార దృక్ఫథంలో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. అధిక రేట్లకు ఎవరైనా సరుకులు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి. టోల్ఫ్రీ నంబర్ కూడా ఇస్తారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి.
ఎక్కడా కూడా పది మందికి మించి గుమికూడవద్దు. కట్టడి చేయాలంటే అందరం కలిసికట్టుగా ఒక్కటి కావాలి. బడ్జెట్ పెట్టకపోతే దేనికి కూడా డబ్బులు ఇవ్వలేం కాబట్టి. వీలైనంత తక్కువ రోజుల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తాం.
పొలం పనులకు వెళ్లే రైతు కూలీలు కూడా వీలైతే ఇళ్ల వద్దే ఉండండి. తప్పని సరి అయితే రెండు మీటర్ల దూరం పాటించాలి. నీళ్లు, కూరగాయాలు, పాలు, ఎలక్ర్టసిటీ, టెలికాం, మందుల షాపులు, పెట్రోలు బంక్లు అందుబాటులో ఉంటాయి. అందరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. వయసు ఎక్కువగా ఉన్న వారిపై కరోనా ప్రభావం ఉంటుంది. షుగర్, బీపీ, కిడ్ని వ్యాధిగ్రస్తులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలో ఉండి నయం అయ్యేవారు 80 శాతం ఉన్నారు.13.8 శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో కూడా 4.5 శాతం మాత్రమే ఐసీయూలోకి వెళ్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఏ స్టేజీలోకి వెళ్తుందనే భయం ఉంది. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను కాపాడుకోవాలంటే ఇవన్నీ కూడా చేయాలి. పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వయసు పెద్దగా ఉన్న అవ్వాతాతలను ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచిస్తున్నాం. పదేళ్లలోపు వయసు ఉన్న పిల్లలను కూడా బయటకు పంపించవద్దు. అందరూ కూడా ఈ నెల 31వ తేదీ వరకు ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కచ్చితంగా హోం ఐసోలేషన్లో ఉండాలి. వారు పొరపాట్లు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సౌత్ కొరియాలో ఒక్కరికి వచ్చింది. ఆ తరువాత దేశమంతా వ్యాపించింది. హోం ఐసోలేషన్లో ఉన్నప్పుడు కొంచెం కష్టమనిపించినా, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నా కూడా 104కు ఫోన్ చేయండి.
సకలం బంద్తో పేదవాళ్లు ఇబ్బందులు పడుతారని ఆలోచన వచ్చింది. కానీ చేయకతప్పదు. వాళ్లందరికీ కూడా ఎక్కువగా చేయలేకపోయినా, వారినష్టాల్లో భాగస్వామ్యం అవుతాం. పేదలందరికీ 29వ తేదీలోగా రేషన్ అందుబాటులో ఉంచుతాం. ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. కంది పప్పు కూడా ఇస్తాం. ప్రతి కుటుంబానికి వెయ్యి చొప్పున ఏప్రిల్ 4వ తేదీన ప్రతి ఇంటికి వచ్చి గ్రామ వాలంటీర్ ఇస్తారు. ఈ మాత్రం చేయడానికే దాదాపు 1,500 కోట్లు ఖర్చు అవుతుంది. పరిస్థితులను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. అందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దాం. దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తోంది. అవే అడుగులు మనం కూడావేయగలిగితేనే ఈ వైరస్ను కట్టడి చేయగలం. అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.