తాడేపల్లి: లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులు ఎట్టకేలకు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుమగమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో మత్స్యకారులు దాదాపు 5 వేల మంది త్వరలోనే స్వస్థలాలకు చేరుకోనున్నారు. లాక్డౌన్ కారణంగా గుజరాత్ వెళ్లిన మత్స్యకారులు ఆ రాష్ట్రంలో చిక్కుకున్నారు. వారి ఇబ్బందులపై ఏపీ సీఎం వైయస్ జగన్ నిన్న గుజరాత్ సీఎం విజయ్రూపానీతో ఫోన్లో చర్చించారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే వారిని ఏపీకి పంపించాలని విజ్ఞప్తి చేయడంతో సముద్ర మార్గంలో రాష్ట్రానికి పంపించేందుకు గుజరాత్ సీఎం అంగీకరించారు. దీంతో ప్రత్యేక బోట్లతో రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలపై సీఎం వైయస్ జగన్ చూపుతున్న చొరవతోనే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. ఇటీవల తమిళనాడులో చిక్కుకున్న 50 మంది మత్స్యకారులను కూడా ఏపీకి సముద్ర మార్గంలో తీసుకువచ్చామని చెప్పారు. అలాగే రెండు నెలల క్రితం పాక్ చెరలో ఉన్న మత్స్యకారులను కూడా సీఎం వైయస్ జగన్ ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి రప్పించినట్లు మంత్రి వివరించారు. మత్స్యకార కుటుంబాలకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న మేలులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.