హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉందని శ్లాఘించారు. జాతి నిర్మాణంలో యువత పాత్రను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
కాగా గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు ప్రదానం చేస్తారు.