తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నామని, కరోనా కట్టడికి ప్రధానిగా మీరు తీసుకున్న చర్యలను బలంగా సమర్థిస్తున్నానని, మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్ ప్రభావాలను సీఎం వైయస్ జగన్ ప్రధానికి వివరించారు. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుదామన్నారు.
ప్రధానితో సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..
రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా కుటుంబాల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం. వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్నవారిని ప్రాథమికస్థాయిలోనే గుర్తిస్తున్నాం.
141 కంటైన్మెంట్ క్లస్టర్లను హాట్స్పాట్లుగా గుర్తించాం
రాష్ట్రంలో 676 మండలాల్లో 37 మండలాలు రెడ్జోన్లో ఉన్నాయి. 44 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. గ్రీన్జోన్లో ఉన్న 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదు. 3 వేలకు పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాం. ఇప్పటికే 141 కంటైన్మెంట్ క్లస్టర్లను హాట్స్పాట్లుగా గుర్తించాం. క్రిటికల్ కేర్ కోసం 4 అత్యాధునిక ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం. ప్రతి జిల్లాకు కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం. అదనంగా 78 ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చాం. ప్రతి జిల్లాలో కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం. క్వారంటైన్ కోసం 26 వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి.
రాష్ట్రంలో వ్యవసాయం ప్రధాన భూమిక
జీఎస్డీపీలో 35 శాతం, ఉపాధి కల్పనలో 62 శాతం వాటా వ్యవసాయానిదే. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు నష్టపోతాయి. ఎగుమతులు లేక ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. 90 శాతం పరిశ్రమలు కరోనా ప్రభావంతో మూతపడ్డాయి. రాష్ట్రాలకు ఆదాయం కూడా రాని పరిస్థితి. సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడింది. వలస, దినసరి కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు
ఆర్థికచక్రం ముందుకునడవాలన్నదే నా అభిప్రాయం
అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు నడవాలన్నదే నా అభిప్రాయం. ప్రజల కనీస అవసరాలకు తగ్గట్టుగానైనా సడలింపు ఇవ్వాలి. మాల్స్, సినిమా హాల్స్, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై లాక్డౌన్ కొనసాగించాలి.