వరదలు తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుంది

4 Nov, 2019 14:25 IST

అమరావతి: ఇసుక అన్నది తాత్కాలిక సమస్య మాత్రమేనని, వరదలు తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రోడ్లు, భవనాల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇసుక తాత్కాలిక సమస్య మాత్రమే. 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోంది. 265కిపైగా ఇసుక రీచ్‌ల్లో 61 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలోనే ఉన్నాయి. వరదల దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా ఉంది. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులకు నిరంతరం వరదల వల్ల ఇసుక సమస్య ఏర్పడింది. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచింది. ఇసుక విక్రయాలకు నూతన పాలసీ తీసుకువచ్చాం. అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నాం. ఈ నెలాఖరునాటికి ఇసుక సమస్య తీరుతుంది. ప్రజలు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించాం. కిలోమీటర్‌కు రూ.4.90కు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నాం. వరద తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుంది. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

Read Also: పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్లా ఎందుకు ఓడిపోయారు