తాడేపల్లి: మనకు ఇళ్ల వద్దే సేవలందిస్తూ.. స్వయం ఉపాధి పొందుతూ..పరోక్షంగా మరి కొంత మందికి ఉపాధి చేపిస్తు సమాజానికి సేవ చేస్తున్న చిరు వ్యాపారులు నిజంగా మహానుభావులని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారులకష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని..తోడుగా ఉండాలనుకున్నానని..ఇందు కోసం రూ.1000 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. చిరు వ్యాపారులు చెల్లించాల్సిన వడ్డీ భారం ప్రభుత్వమే చెల్లుస్తుందన్నారు. 10 లక్షల మంది చిరువ్యాపారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణం జమ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
ఈ రోజు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి, గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశాను. వీరందరికీ మంచి జరగాలని ఆ రోజు కోరుకున్నాను. ఈ రోజు మీ అందరి చల్లని దీవెనలతో మంచి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. పల్లెల నుంచి పట్టణాల వరకు వీధి వీధిలో వ్యాపారం చేసుకుంటున్న లక్షలాది మంది వ్యాపారులకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభిస్తున్నాం. చిన్న వ్యాపారం అనే కంటే ఆత్మ గౌరవంతో అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. బండ్లలో టీఫీన్లు, కూరగాయలు అమ్ముకునే వారంతా కూడా తెల్లవారుజాము నుంచే ప్రారంభిస్తారు. వీరందరినీ మహనీయులుగా గుర్తించుకోవాలి. తోపుడు బండ్లపై సామాన్లు అమ్మేవారు. కూరగాయలు, పూలు అమ్మేవారు. ఓ మోపెడ్ సైకిళ్లపై దుస్తులు, సామాన్లు అమ్మేవారు. వీధి పక్కనే బండిపై టిఫిన్లు అమ్మేవారు లేకపోతే అనేక మందికి గ్రామాల్లో కడుపు నిండని పరిస్థితి ఉంటుంది. అనేక మంది ఇంటి వద్ద సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. వ్యాపారుల బతుకు బండే కాదు..మన ఆర్థిక వ్యవస్థ కూడా నడవదు. వీరందరికి పెద్ద పెద్ద లాభాలు ఉండవు కానీ, శ్రమ మాత్రం ఎక్కువే. వాళ్లందరూ కూడా పెద్ద పెద్ద వడ్డీలకు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. వీరంతా కూడా స్వయం ఉపాధి పొందుతూ..వీలుంటే మరో ఇద్దరికి కూడా ఉపాధి కల్పిస్తుంటారు. వీరు వస్తువులు తెచ్చుకునే కార్యక్రమంలో ఆటోలు, హమాలీలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వీరందరూ కూడా మహానుభావులే. అసంఘటిత రంగంలో బ్యాంకుల నుంచి గతంలో రుణాలు అందేవి కావు. పెట్టుబడికి డబ్బులు రావాలంటే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించేవారు. వీరు చేసే వృత్తికి తక్కువ వడ్డీకి రుణాలు పుట్టవు. వీరికి కావాల్సిన పెట్టుబడి కోసం రూ.100కి పది రూపాయల వడ్డీకి తీసుకొనే పరిస్థితి చూశాం. వీళ్ల జీవితాల్లో మార్పు రావాలని చెప్పి..నా పాదయాత్రలో వీళ్లను చూసి బాధపడ్డాను. వీరికి తోడుగా నిలబడాలని, వీరికి అన్నగా, తమ్ముడిగా వీళ్ల వ్యాపారానికి చేయూత నివ్వాలని అనుకునేవాడిని. ఇందులో భాగంగా జగనన్న తోడు పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
గతంలో వీరికి ఎవరూ కూడా చెయ్యి పట్టుకుని నడిపించే పరిస్థితి లేదు. ఈ రోజు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టేంట్లు తోడుగా నిలబడుతున్నారు. వీరి దరఖాస్తులు స్వీకరించడం, పరిశీలించడం, బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి ఒప్పించడం వంటి రెస్పాన్స్బిలిటీతో వ్యవహరిస్తోంది. దాదాపుగా 10 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందజేస్తోంది. ఏడాదికి రూ.60 కోట్లు వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తోంది. బ్యాంకర్లకు ప్రభుత్వమే తోడుగా ఉంటుంది. చిరు వ్యాపారుల జీవితాలు బాగుపడేందుకు ప్రభుత్వం, బ్యాంకర్లు చెయ్యి చెయ్యి కలిపి విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది.
ఈ రోజు రూ.1000 కోట్లు వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు నుంచి వారం పది రోజుల్లోగా చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లోకే ఈ డబ్బు జమ అవుతుంది. చిరు వ్యాపారులతో పాటు కొండపల్లి బొమ్మలు, బొబ్బలి వీణా, విత్తడిసామగ్రి, కళంకారి వృత్తిదారులకు కూడా వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. బ్యాంకులకు, చిన్న వ్యాపారులకు, హస్తకళాకారులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లోకే వడ్డీ జమ చేస్తోంది. ఒక్కసారి రుణం పొందిన వారు నెల నెల కంతులు చెల్లిస్తే..తిరిగి రుణాలు పొందేందుకు అర్హులవుతారు. ఏడాది లోపు బ్యాంకుకు రుణం చెల్లిస్తే..మళ్లీ రుణాలు ఇస్తుంది. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు అందుతాయి.
చిరువ్యాపారులను చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అర్హులైన వారు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే..గ్రామ సచివాలయాల్లో మీ పేర్లు సరి చూసుకోండి. పొరపాటున పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోండి. ఇంకా నెల రోజులు గడువు ఉంది. మళ్లీ దరఖాస్తు చేసుకోండి. మన ప్రభుత్వం ఎవరికీ ఎగురగొట్టాలని ప్రయత్నం చేయదు. ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరుగదు. గ్రామాలు, పట్టణాల్లో 5 అడుగుల పొడుగు, 5 అడుగుల వెడ్పలు ఉన్న షాపుల వారు, అంతకంటే తక్కువ స్థలంలో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు ఈ పథకానికి అర్హులే. గంపల్లో సామాన్లు మోస్తు అమ్ముకునే వారు. సైకిళ్లపై వ్యాపారం చేసేవారు.
సంప్రదాయ వృత్తిదారులు ఈ పథకానికి అర్హులే. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరు వ్యాపారులకు స్మార్టు కార్డులు కూడా అందజేస్తున్నారు. దరఖాస్తు చేయడం, బ్యాంకు ఖాతా తెరవడం నుంచి రుణాలు ఇప్పించే వరకు వాలంటీర్లు తోడుగా ఉంటారు. ఇంకా ఈ పథకంపై ఏదైనా సందేహాలు ఉంటే 1902 నంబర్కు ఫోన్ చేస్తే నేరుగా ప్రభుత్వ పెద్దలే మీకు సలహాలు ఇస్తారు. పొరపాట్లు సరిదిద్దుతారు. చిన్న వ్యాపారులు చేసుకుంటున్న 10 లక్షల మందికి జగనన్న తోడు పథకం ద్వారా జీవితాల్లో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..మీ చల్లని దీవెనలు మీ బిడ్డపై ఉండాలని కోరుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.