తాడేపల్లి: వైయస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడిన సీఎం వైయస్ జగన్.. తన ప్రసంగం అనంతరం వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. కరోనా కష్టాల నేపథ్యంలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ కాబ్ డ్రైవర్ల కష్టాలను గమనించి నాలుగు నెలల ముందుగానే సాయం అందించారు. ఈ ఏడాది 2,62,495 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకే రూ.10 వేలు చొప్పున వాహన మిత్ర సాయం జమ చేశారు. గతేడాదితో పోల్చితే అదనంగా 37,754 మంది లబ్ధిదారులకు వాహన మిత్ర సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందించారు. అర్హత ఉండి సాయం అందనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, లేదా స్పందన యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సీఎం సూచించారు.