అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం ఉదయం సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, చట్టసవరణ ముసాయిదాలకు ఆమోదం తెలిపింది. వాటిలో భాగంగా.. జూడిషియల్ కమిషన్ ఏర్పాటుపై చట్టసవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్లు కేటాయించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. కౌలు రైతుల రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపడంతోపాటు.. యాజమాని హక్కులకు భంగం కలగకుండా.. 11 నెలల పాటు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా బిల్లుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో 1,33,867 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ అంగీకారం తెలిపింది. భూముల రికార్డులపై కేబినెట్ చట్టసవరణ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటుకు కేబినెట్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 417 కోట్ల భారం పడనుంది. ఎస్సీ, ఎస్టీ గృహావసరాలకు 200 యూనిట్ల విద్యుత్ను అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అంగన్వాడీల జీతాల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.