వలంటీర్లకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: ఒకే పూటలో 54.65 లక్షల మందికి పెన్షన్లు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. వలంటీర్లను అభినందిస్తూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ‘పెన్షన్లను గడప వద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింతగా పెంచింది. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైంది. ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్ రూ. వెయ్యి కాకుండా ఇప్పుడు రూ.2,250 వచ్చింది. పెన్షన్ వయస్సు కూడా 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి, వెంటనే వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు’ అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.