ఎస్ఐ భుజం తట్టిన సీఎం వైయ‌స్ జగన్‌

8 Aug, 2023 10:08 IST

అల్లూరి: గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదల సందర్భంగా.. సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించి ప్రజలను రక్షించిన కూనవరం ఎస్ఐ వెంకటేశన్‌ను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. 
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌.. సోమవారం కూనవరంలో పర్యటించారు. ఆ సమయంలో సభకు హాజరవుతున్న టైంలో ఒక విజ్ఞాపన కోసం బస్సు దిగారాయన. అయితే.. అక్కడే ఉన్న స్థానికులు.. అధికారులు బాగా పని చేశారని సీఎం వైయ‌స్ జగన్‌కు వివరించారు. ఈ క్రమంలో ఎస్సై వెంకటేశన్‌ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించడం.. గతేడాది అయితే దాదాపు 4 నుంచి 5 వేల మంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించాడని సీఎం వైయ‌స్ జగన్‌కు వివరించారు. సీఎం వైయ‌స్ జగన్‌ ఆయన్ని భుజం తట్టి అభినందించారు. అంతేకాదు ఎస్ఐ వెంకటేశన్‌కు పోలీస్‌ మెడల్‌ ఇవ్వాలంటూ పక్కనే ఉన్న అధికారులకు సిఫార్సు చేశారు.