విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినవ అంబేద్కర్ అని ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు కొనియాడారు. విజయవాడ నగరంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పుల్లారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. దళిత వ్యతిరేకులు కాబట్టే ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం పెడతాం అని ప్రకటించి.. చంద్రబాబు మాయ చేసి తప్పుకున్నారని విమర్శించారు. అంబేద్కర్ భావజాలానికి చంద్రబాబు వ్యతిరేకుడు కాబట్టే విగ్రహం పెట్టలేదు. మా నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకుండానే విజయవాడ నడిబొడ్డున ఒక సామాజిక న్యాయశిల్పంగా, రాజ్యాంగానికి ప్రతిరూపంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకుని 125 అడుగుల విగ్రహం పెడుతూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం వైయస్ జగన్ తీసుకున్నారని తెలిపారు. వైయస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారని.. కీలకమైన ఉప ముఖ్యమంత్రి నుంచి, హోం, రవాణా, సాంఘిక సంక్షేమ, పురపాలక, ఎక్సైజ్ వంటి శాఖలను బహుజనులకు కట్టబెట్టారని గుర్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రైనా ఇంత సామాజిక న్యాయంతో పాలన సాగించారా అని పుల్లారావు ప్రశ్నించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంకా మైనారిటీలకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనే గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సీఎం వైయస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రేపు జరిగే రక్తదాన కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కాలే పుల్లారావు పిలుపునిచ్చారు.