ఎస్టీలను గుండెల్లో పెట్టుకుంటా
24 Mar, 2023 15:45 IST
అమరావతి: ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు..వారిని నేను కూడా చివరి వరకు అలాగే గుండెల్లో పెట్టుకుంటానని అసెంబ్లీ సాక్షిగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే తీర్మానాను ఆమోదించి కేంద్రానికి పంపుతున్నట్లు సీఎం వైయస్ జగన్ తెలిపారు. ఈ రెండు బిల్లులపై సీఎం వైయస్ జగన్ సభలో మాట్లాడారు.
- ఈ రోజు సభలో రెండు తీర్మానాలకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాం. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం.
- నా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో తమకు అన్యాయం జరిగిందని, 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాటం చేస్తున్నామని, తమను ఎస్టీ జాబితాలో చేర్చాలనిబోయ, వాల్మీకి కులాలు విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలోని బళ్లారిలో తమ కులస్తులకు ఎస్టీ హోదా ఉందని, రాయలసీమ జిల్లాల్లో ఉన్న తమకు ఎస్టీ హోదా ఇవ్వలేదని వారు ఎన్నో దశాబ్ధాలుగా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు అధికారంలోకి మనం వచ్చిన వెంటనే వీరికి న్యాయం చేసే విధంగా ...ఎస్టీ స్టేటస్ రాష్ట్రం పరిధిలో లేకపోయినప్పటికీ మన చేతనైనంత చేయాల్సిన బాధ్యత, మానవత్వం ప్రతి మనిషిలో ఉండాలి. ఆ మానవత్వంలో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చాం. మనం వచ్చిన తరువాత వీరికి మంచి చేస్తామని మాటిచ్చాం. మేనిపెస్టోలో పేర్కొన్న ప్రకారం బోయ, వాల్మీకిల స్థితిగతులపై అధ్యాయనం చేయించడానికి మన ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ను ఏర్పాటు చేశాం. రిటైర్డు ఐఏఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్కుమార్ను నియమించాం. ఈ కులస్థులు అధికంగా ఉండే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, వైయస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల్లో ఈ కమిషన్ విస్తృతంగా పర్యటించి ఆ కుటుంబాలపై ఆధ్యాయనం చేసింది. వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ద్వారా కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్స్లను పరిగణలోకి తీసుకొని కేంద్రానికి సిఫార్స్ చేస్తూ అసెంబ్లీ ద్వారా పంపుతున్నాం.
- వీరికి ఎస్టీ హోదా కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా కొంత మంది షెడ్యూల్ ఏరియాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్ ఏరియాల్లో ఉన్న వారికి ఊరట కలిగిస్తూ..వారికి తెలియాల్సిన బాధ్యత ఈ సభపై ఉంది.
- వన్ మెన్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు మన రాష్ట్రం మొత్తం మీద 6. ఫార్మూలా, జోనింగ్ వ్యవస్థ రాష్ట్రంలో ఉండటంలో ఉద్యోగాలు, చదువులకు సంబంధించిన విషయాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎస్టీలపై ఎలాంటి ప్రభావం ఈ నిర్ణయం వల్ల జరుగదు. ఆ ప్రాంతాలకు సంబంధించి అన్నీ కూడా వేరే జోన్లోకి వస్తాయి. ఇక్కడి ఉద్యోగాలకు, చదువులకు ఎటువంటి పరిస్థితిలోనూ ఉండదు. నాన్ జోనింగ్ ఉద్యోగాలపై మాత్రమే కొంత ప్రభావం ఉంటుంది. గ్రూప్ వన్ ఉద్యోగాలు గత పదేళ్లుగా కేవలం 386 ఉద్యోగాలు మాత్రమే గ్రూప్1లో నియమించారు. కేవలం 22 ఉద్యోగాల మీదే పోటీ ఉంటుంది. మిగిలిన వాటిలో ఎక్కడా కూడా పోటీ ఉండదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నా ఎస్టీ సోదరులందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. గిట్టని వారు కావాలనే, ఓట్ల కోసం అని ప్రలోభపెట్టి దుష్ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు తెలియజేప్పుతున్నాను.
- షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజనులు, ఆదివాసులకు ఎలాంటి భంగం వాటిల్లదని మీ జగనన్నగా హామీ ఇస్తున్నాను. ఒకరికి న్యాయం చేస్తున్నామంటే ఇంకొకరికి అన్యాయం చేస్తున్నట్లు కాదు. అన్యాయం చేయాలనే అభిప్రాయం, ఉద్దేశం కానీ వైయస్ఆర్సీపీకి, మరీ ముఖ్యంగా మీ జగనన్నకు లేదు.
- నా రాజకీయ ప్రయాణం మొదలైన తరువాత ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నా జీవితం చివరి వరకు కూడా వారిని అలాగే గుండెల్లో పెట్టుకుంటాను. వారికి ఇసుమంతా కూడా అన్యాయం చేయనని హామీ ఇచ్చారు.
- దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని రెండో తీర్మానం ఇవాళ చేశాం. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేశారు. మళ్లీ ఈ రోజు మన చట్టసభలో మనం కూడా ఇదే తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. ఎందుకు ఈ తీర్మానం చేయాల్సి వస్తుందని చెప్పడానికి చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి.
- ఇదే విషయంలో సుప్రీం కోర్టులో కేసు జరుగుతోంది. ఈ కేసులో ఏపీ తరఫున ఇంప్లీడ్ అయ్యి మన వాదన వినిపిస్తున్నాం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే..కారణం ఏంటంటే ..ఒక దళితులు ఇంతకు ముందు తాను ఆచరిస్తున్న మతాన్ని విడిచి మరొక్క మతంలోకి తానువెళ్లినంత మాత్రనా వారి సామాజిక, ఆర్థిక జీవన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు. మతం అన్నది నాలుగు గోడల మధ్య ఆ మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం. ఒక మనిషి మరో మతంలోకి వెళ్తే ఎవరికి అన్యాయం జరగదు. అయినప్పటికీ కూడా కేవలం మత మార్పిడి వల్లే వీరికి రావాల్సిన ఎస్సీ హక్కులు రాకుండా పోవడం అన్యాయమని కచ్చితంగా నమ్ముతున్న సభగా ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రెండు తీర్మానాల వల్ల ఈ సామాజికవర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సరిదిద్దినట్లు అవుతుంది. మనమంతా పాలకులం. నిజంగా అన్యాయం కాబడ్డ వారికి మన చేతనైనకాడికి మంచి జరిగించే కార్యక్రమం చేద్దాం. కచ్చితంగా న్యాయం జరిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈ రెండు తీర్మానాలు వాళ్లకు బలాన్ని ఇచ్చేందుకు ఈ అవకాశాన్ని మనం తీసుకొని తీర్మానం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.