తాడేపల్లి: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో కర్నూలు జిల్లాకు బయల్దేరనున్నారు. కర్నూలులోని సంకల్భాగ్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలతో తుంగభద్ర పుష్కరాలను సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నేటి ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి 11:30 గంటలకు ఓర్వకల్లుకు ప్రత్యేక విమానంలో బయల్దేరుతారు. 12:30 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు బయల్దేరుతారు. 1 గంటకు ఎపీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డు మార్గాన సంకల్భాగ్ పుష్కరఘాట్కు 1:10 గంటలకు చేరుకుంటారు. పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుష్కరాలను ప్రారంభించిన అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు.