రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
తాడేపల్లి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తిని కాబట్టి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా అన్ని విధాల తోడుగా ఉన్నానని చెప్పారు. పాదయాత్రలో..ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కంటే మిన్నగా రైతుల కోసం వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అదనంగా అందజేస్తూ రైతుకు తోడుగా ఉన్నామన్నారు. గతంలో ప్రకృతి వైఫరీత్యాల కారణంగా నష్టపోతే అప్పటి ప్రభుత్వాలు పట్టించుకునేవి కావన్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం అందజేస్తున్నామని గర్వంగా చెప్పారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న ప్రభుత్వం మనదని..ఇవాళ రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,766 కోట్లను జమచేస్తున్నామని చెప్పారు. వైయస్ఆర్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద ఈ నిధుల్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. వైయస్ఆర్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు రూ.646 కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సీజన్లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్లోనే అది కూడా కేవలం నెల రోజుల్లోపే పరిహారం అందించి రైతుకు తోడుగా నిలిచామన్నారు.
రైతు పక్షపాత ప్రభుత్వం మనది..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనది. మొట్టమొదటి రోజు నుంచి రైతు పక్షపాత ప్రభుత్వంగా బాహటంగా చెప్పడమే కాకుండా.. ప్రతి అడుగు రైతుసంక్షేమం కోసమే వేశాం. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.87,612 కోట్లు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించి ఐదేళ్లలో విడతలుగా కేవలం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదని, స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాతపూర్వకంగా తెలిపింది. అంతేకాదు.. ధాన్యం బకాయిలు, విత్తనం బకాయిలు, ఇన్సూరెన్స్ బకాయిలు, కరెంట్ బకాయిలు, చివరకు ఇన్పుట్ సబ్సిడీ, సున్నావడ్డీ బకాయిలు చెల్లించకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.