అమరావతి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ గొప్ప మానవతావాది అని, వెనుకబడిన తరగతుల మహానాయకుడని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లతో పాటు రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లో బీసీలకే ప్రాధాన్యతనిచ్చినట్టు చెప్పారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వెనుకబడిన కులాల వారికి గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేషన్ల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. గతంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ బహుజనులకు సరైన ప్రాధాన్యత దక్కలేదని తెలిపారు. అక్టోబర్ 18 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన గౌరవం దక్కిన రోజని కొనియాడారు.