ప్రజాపంపిణీ వ్యవస్థ

20 May, 2021 13:35 IST

 

2021 జనవరి 21న మన ప్రభుత్వం, 9,260 సంచార పంపిణీ యూనిట్ల (M.D.U.) ద్వారా అర్హత గల లబ్దిదారులకు వారి గృహాల వద్దనే అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రజాపంపిణీ వ్యవస్థ క్రింద పంపిణీ చేసే మునుపెన్నడూ లేని బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి నెలా చౌకధరల దుకాణాల నుండి నిత్యావసర సరుకులను (రేషన్) పొందడానికి బదులు ఇంటి వద్దనే నిత్యవసర సరుకులను (రేషన్)అందించడం వలన రోజువారీ వేతన కార్మికుల, వయోవృద్ధుల మరియు దివ్యాంగుల సమయం మరియు శ్రమ ఈ కార్యక్రమం ద్వారా ఆదా అవుతున్నాయి. స్వయం ఉపాధి పథకం క్రింద షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మరియు మైనారిటీల నిరుద్యోగ యువతకు 90% ప్రభుత్వ రాయితీతో సంచార పంపిణీ యూనిట్లను (M.D.U.) అందివ్వడం జరిగింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఈ రకమైన చొరవ ఇంతకుముందు జరిగిన నల్ల బజారు వ్యవహారములు, ఎక్కువ శాతం రంగు వెలసిన మరియు నూకలతో కూడిన బియ్యం సరఫరా వంటి అవకతవకలకు స్వస్తి పలకడం ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. రేషన్ ఇంటి వద్దకే పంపిణీ చేయడం ద్వారా 12వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన (S.D.G-12) 'స్థిరమైన వినియోగ ఉత్పత్తి విధానం అవలంబించడం', తద్వారా గొలుసు సరఫరా విధానం వలన జరిగే ఆహార నష్టాల తగ్గింపును సాధించ గలుగుతున్నాము.

27. గత సంవత్సరం అనగా 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3,103 కోట్ల రూపాయలు అదనపు వ్యయం చేయడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసమై 754 కోట్ల రూపాయలను మే మరియు జూన్, 2021 నెలలకుగాను ఖర్చుచేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.