మాజీమంత్రి సీదిరిపై సీఐ బూతుపురాణం
శ్రీకాకుళం: టీడీపీ కూటమి పాలనలో పోలీసుల ఓవరాక్షన్ రోజురోజుకీ శృతిమించుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులపట్ల ఇష్టారాజ్యంగా ప్రవరి్తస్తున్నారు. తాజాగా.. మాజీమంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు దురుసుగా ప్రవర్తించి బూతుపురాణం అందుకున్నారు. మాజీమంత్రి అని కూడా చూడకుండా ఆయనపై వేళ్లు చూపిస్తూ ‘తమాషా దె...’ అంటూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పోలీసుస్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలివీ.. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజ్ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్ పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు.
అయితే, గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఆయన భార్య లక్ష్మితో వాగ్వాదానికి దిగి దానిని కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో.. బాధితులు ప్రతిఘటించగా వారిపై దాడిచేశారు. ఈ విషయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే, నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్లో ఉంచారు. తమ గొర్రెలను అపహరించారని.. తాను వేసుకున్న షెడ్ను కూల్చడానికి యత్నించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు.
విషయం తెలుసుకున్న మాజీమంత్రి సీదిరి అప్పలరాజు పోలీసుస్టేషన్కు వెళ్లి బాధితుల పక్షాన పోలీసులను నిలదీశారు. బాధితులిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు మాజీమంత్రిపట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాసేపటి తర్వాత బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు వంత పాడడం సరికాదని, అధికారం శాశ్వతం కాదనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించి బాధితులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. మరోవైపు.. సీఐ ప్రవర్తనపై స్థానిక మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.