బీసీ మహిళాను నడిరోడ్డు మీద అవమానిస్తారా ?
కాకినాడ: ఒక ఉన్నత స్థానంలో ఉండి, మంత్రిగా పని చేసిన విడదల రజినీపై ఇష్టం వచ్చినట్టు సీఐ వ్యవహరించిన తీరు చాలా దారుణమని వైయస్ఆర్సీపీ నాయకురాలు, మాజీ ఎంపీ వంగా గీతా మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన ఒక మహిళాను నడిరోడ్డు మీద అవమానిస్తారా ? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పక్షాన, వైయస్ఆర్సీపీ పక్షాన పోలీసుల తీరును తీవ్రంగా కండిస్తున్నామంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, మాజీ మంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ తీరును పలువురు నేతలు ఎండగట్టారు.
మహిళలకు రక్షణ లేదు: ఆరె శ్యామల
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్కు రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పడానికి ఇటీవల మాజీ మంత్రి విడుదల రజినీ పట్ల సీఐ అనుసరించిన తీరే నిదర్శనమని, ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి? ఒక మాజీ మహిళా మంత్రి పై సీఐ రౌడీయిజం చేశారంటూ శ్యామల తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. `కూటమి ప్రభుత్వంలో ఒక మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా నాయకురాలు విడదల రజినీకి లేని భద్రత ఇంక సామాన్య ప్రజలకి ఎక్కడిది..!. తన కారులో కూర్చొని ఉంటే ఒక మహిళ అని విచక్షణ లేకుండా చేయి పట్టుకొని బయటికి లాగి మాజీ మంత్రిపై అత్యంత దారుణంగా చిలకలూరిపేట సీఐ సుబ్బారాయుడు ప్రవర్తించాడు` అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
సీఐ వైఖరిని నిరసిస్తూ కర్నూలులో ధర్నా
మాజీ మంత్రి విడుదల రజని పై పోలీసుల వైఖరిని నిరసిస్తూ కర్నూలు నగరంలోని ఎస్వీ సర్కిల్లో వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి విడదల రజినిపై దురుసుగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలను తో నిరసన ప్రదర్శన చేపట్టారు.
కూనవరం మండలంలో..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కూనవరం మండలం, టేకులబోరులో మాజీ మంత్రి విడుదల రజని పై పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైయస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డుకోవాలని డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని బీసీ మహిళను సైతం అత్యంత దారుణంగా అవమానపరిచేలా కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించటం సిగ్గు చేటని నేతలు మండిపడ్డారు. చిలకలూరిపేటలో పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, బీసీ మహిళ అయిన విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు అనుచితంగా ప్రవర్తించి, ఆమైపె దౌర్జన్యం చేయడం చాలా బాధాకరమన్నారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఏక వచనంతో ‘నీకు చెప్పేదేంటి, నీతో మాట్లాడేదేంటి?’ వంటి పదాలతో ఆమెను అవమానించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఓ పోలీసు అధికారినన్న స్పృహ కూడా లేకుండా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరించడం దారుణమన్నారు.