దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్ జగన్
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం వైయస్ జగన్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని మూలా నక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) రోజున సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి వైయస్ జగన్ దర్శించుకొని, అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎంను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం వైయస్ జగన్ వెంట డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంశాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.