రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.2,205 కోట్లు

14 Feb, 2022 16:49 IST

తాడేపల్లి: రహదారుల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.2,205 కోట్లు ఇచ్చామని,  ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రోడ్లు, భవనాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తిచేశామని, నెలాఖరునాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వహయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదని చెప్పారు. తర్వాత వర్షాలు బాగా పడటంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయని, ఈ ప్రభుత్వ హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి విషప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.2,205 కోట్లు ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంత డబ్బు ఇవ్వలేదన్నారు. మే చివరి నాటికి దాదాపు రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. 33 ఆర్వోబీలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలోనే అవి పూర్తికాలేదన్న రీతిలో విష ప్రచారం చేస్తున్నారని, వీటిని పూర్తి చేయడానికి సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు.  

విశాఖ బీచ్‌ కారిడార్‌ రోడ్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. రోడ్డు నిర్మాణ రీతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలన్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకోవాలని, అలాగే ఎయిర్‌పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలన్నారు. దీంతో పాటు ఈ రహదారిని ఆనుకొని టూరిజం ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయని, నేవీ ఆంక్షల వల్ల రాత్రిపూట ల్యాండింగ్‌కు కష్టం అవుతుందన్నారు. ఇలాంటి నేపథ్యంలో బీచ్‌ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.