తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని తేలిపోయింది
తాడేపల్లి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ జగన్గారిపై బురద జల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబు, పవన్కళ్యాణ్ కుట్ర బట్టబయలైందని వైయస్ఆర్సీపీతూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో విష ప్రచారం చేసి, కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు, పవన్కళ్యాణ్ వెంటనే శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం దురుద్దేశంతోనే తిరుమల నెయ్యిపై విష ప్రచారం చేసి, గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్గారిపై నిందలు వేశారని చెప్పారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డెయిరీ నిజానికి అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని వెల్లడించారు. అయినా దాన్ని వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి విష ప్రచారం చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు.
మీడియాతో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:
ఆ ఇద్దరూ తక్షణం క్షమాపణ చెప్పాలి:
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్గారిని అప్రతిష్టపాల్జేయడం కోసం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్కళ్యాణ్ విపరీతంతా దుష్ప్రచారం చేశారు. కానీ అది అబద్ధమని ఇప్పుడు తేలింది. రాజకీయ దురుద్దేశంతో అసత్యాన్ని ప్రచారం చేసి, హిందువుల మనోభావాలు గాయపర్చిన ఆ ఇద్దరూ వెంటనే శ్రీవారి భక్తులందరికీ క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పుడు పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సనాతన ధర్మం పేరిట ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి డ్రామాలాడిన పవన్కళ్యాణ్ ఇప్పుడు ఎలా, ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడో చెప్పాలి.
భోలే బాబా డెయిరీ ఎప్పుడొచ్చింది?:
తిరుమలకు నెయ్యి సరఫరాకు సంబంధించి, భోలే బాబా డెయిరీపై ఆరోపణలు చేశారు. మరి ఆ డెయిరీ ఎప్పుడు, ఎవరి హయాంలో వచ్చింది?. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భోలే బాబా డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదించింది. 2018, జూన్ 26న జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్ మినిట్స్లో ఆ అంశం ఉంది.
‘టీటీడీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు భోలేబాబాకు చెందిన హర్ష్ ఫ్రెష్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, 2018లోనే సాంకేతిక అర్హత సాధించిందంటూ ఆరోజు.. అంటే.. 2018, జూన్ 26న జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు తీర్మానం చేసింది’.
మరి, దీన్ని బట్టి చూస్తే భోలేబాబా డెయిరీని తిరుమలకు ఎవరు తీసుకొచ్చారు? తిరుమలలో ఆ సంస్థకు ద్వారాలు తెరిచింది ఎవరు? చంద్రబాబు కాదా? దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారు?
కుట్ర బట్టబయలైనా ఎదురుదాడి. విష ప్రచారం:
తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు లేదని స్పష్టంగా తేలినా, చంద్రబాబు మాత్రం ఇంకా దుష్ప్రచారం ఆపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి మరీ ఆలయ ప్రతిష్టను ఇంకా దిగజార్చే పనిలోనే ఉన్నాడు. తన రాజకీయ లబ్ధి కోసం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి వాడారని ప్రచారం చేయాలని మంత్రులను ఆదేశిస్తున్నారు.
కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది భక్తుల మనోభావాలు ఫణంగా పెట్టి మరీ రోజురోజుకీ దిగజారుతూ చంద్రబాబు ఇప్పటికే అథఃపాతాలానికి పడిపోయాడు. చేతిలో మీడియా ఉందనే ధైర్యంతో రెచ్చిపోతున్నాడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా అడుగడుగునా అపచారాలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఈ మహా పాతకానికి ఎప్పటికైనా చంద్రబాబుకు తగిన ప్రతిఫలం తప్పదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు.