బీసీలను చంద్రబాబు.. దగా చేశారు..
పశ్చిమగోదావరి:దాదాపు ఆరవై శాతంపైగా బీసీలకు న్యాయం జరగలేదని వైయస్ఆర్సీపీ నేత వరప్రసాద్ అన్నారు.ఏలూరు జ్యోతిబా ఫూలే సభా ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం.. బీసీలను ఆశపెట్టి ఓట్లు వేయించుని వారి సంక్షేమాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. 40 సంవత్సరాల అనుభవం అంటూ గొప్పలు చెప్పుకుంటూ..మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బీసీలను మోసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. 2012లో టీడీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను పరిశీలిస్తే..140 కులాలు ఉన్న బీసీలను ఆశపెట్టి ఓట్లు వేయించుకుని మోసం చేశారన్నారు. బీసీలకు 100 ఎమ్మెల్యే సీట్లు, ప్రతి సంవత్సరం 10 వేల కోట్లు, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్, కులానికో ప్రత్యేక కార్పొరేషన్, ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్, వైద్య ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ వంటి వాగ్దానాలు చేశారన్నారు. వాస్తవానికి అన్ని విషయాల్లోనూ బీసీలను చంద్రబాబు దగా చేశారని ధ్వజమెత్తారు.