విశాఖ : శిరోముండనం బాధితుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.దళితులపై దాడులను ప్రభుత్వం సహించదని మంత్రి స్పష్టం చేశారు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదిప్రాజ్, వైయస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఘటన జరిగిన తీరుతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రీకాంత్ కు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దళితులకు సీఎం వైయస్ జగన్ పాలనలో పూర్తి న్యాయం..
సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పాలన లో దళితులు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని మంత్రి అవంతి చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్కు అందజేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అవంతి తెలిపారు.