అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయిదు అంశాలపై చర్చించిన మంత్రివర్గం... పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేసింది. హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని రైతుల పరిహారంపై కూడా కేబినెట్లో జరిగింది. రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.2500 నుంచి రూ.5000కు పరిహారం పెంచుతూ, 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఆర్డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథార్టీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు.