వైయస్ జగన్ రాప్తాడు పర్యటనకు ఆంక్షలు
అనంతపురం: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైయస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైయస్ఆర్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించనున్నారు. అయితే, వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చారు. అలాగే, వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల తీరును వైయస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్నారు.