తాడేపల్లి: విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డిస్కమ్లను ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. సోమవారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కోవిడ్తో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులకు 75శాతం వ్యాక్సిన్ వేశాం’’ అని తెలిపారు.
‘‘గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని 80వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచింది. విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు సీఎం జగన్ 18వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. డిస్కమ్లను ప్రైవేటీకరించే ఆలోచన మాకు లేదు. మోటర్లకు మీటర్లు పెట్టినా ప్రజలపై భారం పడకుండా చర్యలు’’ తీసుకుంటామని బాలినేని తెలిపారు.