ఔత్సాహిక వ్యోమగామి జాహ్నవికి ఏపీ భారీ ప్రోత్సాహకం
రాజమహేంద్రవరం: ఔత్సాహిక వ్యోమగామి దంగేటి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది. వ్యోమగామి కావాలన్న జాహ్నవి కల సాకారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును జాహ్నవికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అందజేశారు. తన కల సాకారం అయ్యే దిశగా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం వైయస్ జగన్కు జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు. వ్యోమగామికి వెళ్లాలని తన కోరిక అని.. తన కల నెరవేరదేమోనని అనుకుంటున్న సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణును కలిశానని.. మంత్రి వేణు చొరవతో తనకు ఆర్ధిక సాయం చేసేందుకు సీఎం వైయస్ జగన్ అంగీకరించారని.. ఆయన చేసిన ఆర్ధిక సాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని జాహ్నవి తెలిపింది.
వ్యోమగామిగా వెళ్లాలనే జహ్నావి అనే పేద బాలికకు సీఎం వైయస్ జగన్ ఆర్ధిక సాయమందించారని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వ్యోమగామి కావాలంటే ఇంటర్నేషనల్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు చేయాల్సి ఉందని.. ఆ పైలెట్ ట్రైనింగ్ కోర్సు నిమిత్తం రూ. 50 లక్షలు అందించారని తెలిపారు. పేదల కలలను సీఎం వైయస్ జగన్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. కాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ చదువుతూనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయురాలిగానే కాకుండా తొలి ఆసియా ఖండ వాసిగా కూడా జాహ్నవి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో తాను వ్యోమగామి కావాలన్న సంకల్పంతో సాగుతున్న జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది.