15వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నూతన శకానికి తెరతీసిన 15వ శాసనసభ కొలువుదీరింది. ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆశలను మోసుకుంటూ భవితకు భరోసానిస్తూ కొత్త శాసనసభ తొలిసారిగా బుధవారం సమావేశమైంది. మొదట జాతీయ గీతంలో సభ ప్రారంభం అయ్యింది. ప్రోటెం స్పీకర్ శంబంగి అప్పలనాయుడు సభను ప్రారంభించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అఖండ మెజార్టీతో ప్రజలు ఓ పార్టీకి అధికారం అప్పగించిన శాసనసభ. చరిత్ర సృష్టిస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన జననేత ముఖ్యమంత్రిగా సభా నాయకుడి హోదాను అలంకరించబోతున్నారు. 25 మంది మంత్రుల్లో ఏకంగా 19 మంది కొత్త మంత్రులుగా అధికార స్థానాల్లో కూర్చొనబోతున్న సభ. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టబోతున్న సభ కూడా ఇదే.. అందుకే తొలిసారిగా కొలువుదీరిన 15వ శాసనసభపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత శాసనసభ ప్రజాస్వామ్యానికి మిగిల్చిన మరకలను చెరిపేస్తూ.. గత ఐదేళ్ల కష్టాల నుంచి సాంత్వన కోరుతూ కొత్త శాసనసభ వైపు ఆశగా చూస్తున్నారు.