జనతా కర్ఫ్యూకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం
తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ఈ నెల 22న తలపెట్టిన జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లు, నోడల్ ఆఫీసర్లతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో అన్ని చర్యలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ట్రంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.119 నమూనాలు పరీక్ష చేస్తే 108 కేసులు నెగిటివ్, 17 కేసులకు ఇంకా రిపోర్టు రావాల్సి ఉందన్నారు. విశాఖలో కరోనా మరణమని కొన్ని చానళ్లు ప్రసారం చేసింది అవాస్తవమన్నారు. వైద్య, ఆరోగ్యశాఖతో సంప్రదించి ఏదైనా వార్త ప్రసారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త ల్యాబ్స్ అవసరమని ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. అంతర్జాతీయ విమానాలు ఎక్కువ కాలం బ్యాన్ చేయాలని కోరినట్లు చెప్పారు.