తాడేపల్లి: రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అరటి, టమాటా వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నామని వివరించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన ఉత్పత్తులకు ఇబ్బంది లేకుండా రవాణా నిబంధనలను సడలించామని వివరించారు. రైతు బజార్లను ఎక్కడికక్కడ వికేంద్రీకరించామని, మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.
కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని, ప్రధానితో చంద్రబాబు మాట్లాడినప్పుడు దేశమంతా రూ. 5 వేలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. రైతులకు చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా సీఎం వైయస్ జగన్ చెల్లించారని గుర్తుచేశారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం గతంలో కోట్లాది రూపాయలను ఖర్చు చేశాడని, ఆయన పబ్లిసిటీ పిచ్చి 23 సీట్లకే పరిమితం చేసిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని నాగిరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో కూర్చున్న చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని నిలదీశారు.