హక్కులు కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
అనంతపురం : రాజ్యాంగం కల్పించిన హక్కులను చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోమవారం అనంతపురంలోని వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. దేశమంతటా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ నిరంకుశ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గాంధీజీ చూపిన అహింసా మార్గంలో, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు గౌరవంగా దేశానికే తలమానికంగా విజయవాడలో 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, సామాజిక న్యాయం, సమానత్వమే తమ పార్టీ ధ్యేయమని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.