తాడేపల్లి: ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉన్నా పేదవాడికి మేలు చేసేందుకు సంక్షేమ పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రతి నెలా ఒక కొత్త కార్యక్రమంతో కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. " వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి.. అలాగే పెన్షన్లు రూ. 2,250 వరకు తీసుకెళ్లాం. ఆర్థిక ఇబ్బందులున్నా కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి రూ. వెయ్యి అందజేశాం. నెలకు మూడు సార్లు రేషన్ ఇస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పటికే రెండు సార్లు ఇచ్చాం. ఈ నెల 24న సున్నా వడ్డీ పథకానికి రూ. 1400 కోట్లు ఇవ్వబోతున్నాం.
ఫీజురీయింబర్స్మెంట్ కోసం ఈనెలలోనే రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 1800 కోట్లు చెల్లించాం. ఈ ఏడాది మార్చి 31 వరకు బకాయిలు లేకుండా ఫీజురీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లి అకౌంట్లోనే నేరుగా ఫీజురీయింబర్స్మెంట్ జమ చేస్తాం. కష్టాల్లో ఉన్నా కూడా పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నాం. కరోనా లాంటి ఇబ్బందికర సమయాల్లో కూడా గతంలో కవర్ అయిన ప్రతి మసీద్కు రంజాన్ నాటికి పూర్తి బకాయిలు చెల్లిస్తాం. కవర్ కాని మసీద్లకు కూడా రూ. 5 వేలు, ప్రతి చర్చికి రూ. 5 వేలు ఇస్తాం. అలాగే ప్రతి ఆలయానికి రూ. 5 వేలు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం" అని సీఎం వివరించారు.