పార్వతీపురం: భారతదేశ స్ఫూర్తిని పెంచేలా, జాతీయ సమైక్యతను చాటేలా సీతానగరంలో 120 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాది కాఅమృత్ మహోత్సవం హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండల కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహించిన భారీ జాతీయ జండాతో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి మండల కేంద్రంలో జాతి పిత మహాత్మా గాంధీజీ , డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ జాతీయ జండాతో విద్యార్థులు, ఉద్యోగ విభాగాలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వివిధ సంఘాల పౌరులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అలజంగి జోగారావు మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధిస్తూ సాంకేతికంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యా పరంగా అన్ని రంగాలలో స్థిరమైన అభివృద్ధిని సాధించడం జరుగుతుందని చెప్పారు. ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల పోరాటం, లక్షలాదిమంది ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వతంత్ర భారతదేశం గౌరవాన్ని పెంచేలా, దేశ ఐక్యతను మన అందరం కాపాడు కోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఇందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.