కోడెల తీరు సిగ్గుచేటు
అమరావతి: మాజీ స్పీకర్ కొడెల శివప్రసాద్ తీరు సిగ్గు చేటు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ పర్నీచర్ ప్రజల ఆస్తి అని, కోడెలా తన ఇంటికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. విచారణ జరుగుతుంది కాబట్టే ఆ ఫర్నీచర్ని తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు. అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా?, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. విచారణలో ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటే, తప్పు ఒప్పు అవుతుందా అని నిలదీశారు. ఫర్నీచర్ను ఇంటికి తీసుకెళ్లి నరసరావుపేటకు కోడెల శివప్రసాదరావు మచ్చ తెచ్చారన్నారు. 50 ఐఫోన్లు కాజేసి బయట అమ్ముకున్నారన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి పని చేశారంటే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉమెన్స్ పార్లమెంట్ సమావేశంలో కొడెల మాట్లాడుతూ..కార్ షెడ్డులో ఉండాలి..ఆడవాళ్లు వంటింట్లో ఉండాలని వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ పర్నీచర్ అసెంబ్లీలో ఉండాలా? కోడెల ఇంట్లో ఉండాలా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన ఉదాంతాలు వింటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చే మెడిసిన్స్ కోడెల కూతురు మెడికల్ షాపుల్లో పెట్టి అమ్ముకున్నారని ఆరోపించారు. ఏ పర్నీచర్ పోయిందో విచారణ చేస్తున్నామన్నారు. అవినీతిని వెలికితీస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తిని ఇంటికి తీసుకెళ్లడం సిగ్గు చేటు అన్నారు. పబ్లిక్ ప్రాపర్టీని తన ఇంట్లో, హీరో హోండా షోరూమ్లో ఎలా పెట్టుకుంటావని ప్రశ్నించారు. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి నేతను టీడీపీలో ఎలా కొనసాగిస్తారని నిలదీశారు.