ఇదేం రాజ్యం చంద్రబాబూ.. 

20 Oct, 2024 18:24 IST

  తాడేపల్లి :  బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిని  హత్యాచారం చేసిన ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైయ‌స్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బద్వేల్‌ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు.  ఈ మేరకు ఎక్స్ వేదిక‌గా వైయ‌స్‌ జగన్‌..  కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్ర‌బాబు గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు…  ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. 

చంద్రబాబుగారూ మీరు వైయ‌స్ఆర్‌సీపీ మీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్రప్రజలమీద కక్షసాధిస్తున్నారు. ఇది అన్యాయంకాదా? వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనంకాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకంచేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్‌ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ రూంకు, అక్కడనుంచి దగ్గర్లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్‌చేస్తారు. వారు ఫోన్‌ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లోచెప్పినా  ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్‌ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’’పై రాజకీయ కక్ష ఎందుకు? 

దిశ కార్యక్రమాన్ని బలోపేతంచేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్‌ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్‌స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్‌ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. 

వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబుగారూ? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్‌ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ…? అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.