అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం అడిగినంత సమయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇవాళ స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలపై బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. బీఏసీ సమావేశానికి సీఎం వైయస్ జగన్, ప్రతిపక్షం నుంచి అచ్చెన్నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తాను పాల్గొన్నామని తెలిపారు. గతంతో పోల్చితే ఈ సమావేశం అర్థవంతంగా జరిగింది.
సీఎం వైయస్ జగన్ ప్రారంభంలోనే స్పష్టంగా చెప్పారు. ఈ సభను హుందాగా, అర్థవంతంగా, విలువైన చర్చల దిశగా నిర్వహించాలని భావించామని చెప్పారు. అవసరమైతే ఎక్కువ రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. ఎన్ని రోజులైనా ఈ సభను అర్థవంతమైన చర్చల దిశగా నిర్వహిస్తామని సీఎం చెప్పారని, ప్రతిపక్షానికి ఇలాంటి పిలుపు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రతిపక్షానికి కావాల్సిన సమయాన్ని ఇస్తామని వైయస్ జగన్ కొత్త ఒరవడికి తెర లేపారు. ప్రతిపక్షం పూర్తిగా స్పష్టతతో చెప్పలేకపోయారు.
టీడీపీ తరఫున పాల్గొన్న అచ్చెన్నాయుడికి సీఎం సూచించారని తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ నెల 30వ తేదీ వరకు 14 రోజులు ఈ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షం ఇంకా సమయం కావాలని అడిగితే పొడిగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శని, ఆదివారాలు మినహా సమావేశాలు కంటిన్యూగా సాగుతాయన్నారు. ఈ నెల 12న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రవేశపెడతారని, అదే రోజు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతానని తెలిపారు. సభాలో చర్చించే అన్ని అంశాలపై సభాపతికి ప్రభుత్వం ఓ లేఖ ఇచ్చామన్నారు. ప్రతిపక్షం మాత్రం శాంతిభద్రతలపై చర్చించాలని స్పీకర్కు లేఖ ఇచ్చారన్నారు.