రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు ఆరోపణలు
విజయవాడ: రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో అధికారులు అందరూ బాగా పని చేశారని, కొందరు నేతలు, కొన్ని మీడియా సంస్థలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదికి వరద ప్రభావం క్రమంగా తగ్గుతుందని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు అవసరమైన నీరు, ఆహారం అందుబాటులో ఉంచామని, పునరావాసకేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ నేతలు వరద రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం రాష్ట్రంలో వరద పరిస్థితిపై సమీక్షిస్తున్నారని చెప్పారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.