బాబు కుట్రలపై జన'కోటి' గర్జన 

15 Dec, 2025 10:56 IST

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా : మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ  చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.  జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. 

సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్‌ కళాశాలలు ప్రైవేట్‌పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదని
మెడికల్‌ కళాశాలలు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. 

పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రైవేట్‌ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు.   

ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి  
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైయ‌స్ఆర్‌సీపీకార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్‌ మీదుగా ఎనీ్టఆర్‌ సర్కిల్, సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ మీదుగా హెడ్‌ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు.  

వైద్య విద్యపై నీచరాజకీయం 
వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు.     
– పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు