న్యూఢిల్లీ: విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఆత్మనిర్భరత ఎక్కడుందని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందన్నారు. ఎన్నికల రాష్ట్రాలకే బడ్జెట్ అని తొలుత భావించినా చివరకు ఏ రాష్ట్రానికీ చెందని బడ్జెట్లా ఉందని విమర్శించారు. రాజ్యసభలో బుధవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ఆర్భాటం తప్ప విషయం లేదన్నారు. రాష్ట్రాల వాటాను కేంద్రం తెలివిగా ఎలా సొంతం చేసుకుంటోందో గణాంకాలతో సహా సభకు వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
రాష్ట్రాల వాటా తెలివిగా లాగేస్తున్నారు
‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను తగ్గించడంలో కేంద్రం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. బడ్జెట్ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్థూలపన్నుల ఆదాయంలో ఉద్దేశపూర్వకంగానే సెస్సులు, సర్చార్జీలను పెంచుకుంటూ పోయింది. సెస్సులు, సర్చార్జీల పేరిట వచ్చే ఆదాయంలో నయా పైసా వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేనందునే కేంద్రం ఈ పనిచేస్తోంది. కేంద్రానికి వచ్చే స్థూలపన్నుల ఆదాయంలో డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటాను పంపిణీ చేయాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. అయితే.. డివిజబుల్ పూల్లోకి రాని సెస్సులు, సర్చార్జీల పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్కు పన్నుల పంపిణీలో దక్కాల్సిన వాటా 41 శాతం నుంచి 29 శాతానికి పడిపోయింది.
పెట్రోల్, డీజిల్ సెస్సులో రాష్ట్రాలకు ఇచ్చిందెంత?
పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.3.35 లక్షల కోట్లు ఆర్జించినా అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది 5.8 శాతం.. అంటే రూ.19,475 కోట్లు మాత్ర మే. పెట్రోల్, డీజిల్పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం మరో రూ.2.87 లక్షల కోట్లు వసూలు చేసింది. ఎక్సైజ్ డ్యూటీ కింద రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పెట్రోల్పై 40 శాతం, డీజిల్పై 59 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై 85 శాతానికిపైగా ఎక్సైజ్ డ్యూటీని సెస్ రూపంలో వసూలు చేస్తోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 ఉంటే అందులో పలు సెస్ల కారణంగా రాష్ట్రాలకు రూ.1.40 మాత్రమే పంపిణీ అవుతోంది.
డివిజబుల్ పూల్లో 4.1 శాతానికి పడిపోయిన ఏపీ వాటా
కేంద్ర ప్రభుత్వం డివిజబుల్ పూల్ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నుల వాటాలో ఏపీ వాటా నానాటికీ తగ్గిపోతోం ది. 13వ ఆర్థికసంఘం (2010–15) సిఫా ర్సుల ప్రకారం డివిజబుల్ పూల్లో ఏపీ వాటా 6.9 శాతం. 14వ ఆర్థికసంఘం (20 15–20) దాన్ని 4.3 శాతానికి తగ్గించింది. 15వ ఆర్థికసంఘం (2021–20 26) సిఫా ర్సుల ప్రకారం డివిజబుల్ పూల్లో ఏపీ వాటా 4.1 శాతానికి పడిపోయింది. సెస్సులు, సర్చార్జీల పేరుతో కేం ద్రం దొడ్డిదారిన వసూలు చేసే ప న్నులతో డివిజబుల్ పూల్లో జమయ్యే స్థూ ల ఆదాయం మొత్తం క్షీణిస్తుంటే మరోవైపు ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగా డివి జబుల్ పూల్ నుంచి వచ్చే ఏపీ ఆదాయం తగ్గిపోతోంది.
ఏపీ, కేంద్ర బడ్జెట్ మధ్య అంతరం
సమాజంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు జరపడం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆర్థిక అరాచకానికి పాల్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శనీయమైన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఏపీ 2021–22 బడ్జెట్లో వ్యవసాయానికి 5.9 శాతం నిధులు కేటాయిస్తే, 2022–23 బడ్జెట్లో కేంద్రం 3.8 శాతం కేటాయించింది. విద్యారంగానికి ఏపీ 11.8 శాతం నిధులు కేటాయిస్తే కేంద్ర బడ్జెట్లో అది 2.6 శాతం మాత్రమే. ఆరోగ్యరంగానికి ఏపీ బడ్జెట్లో 6 శాతం కేటాయిస్తే కేంద్ర బడ్జెట్లో 2.2 శాతం, గ్రామీణాభివృద్ధికి ఏపీ 7.1 శాతం నిధులిస్తే కేంద్రం 5.2 శాతం, సామాజిక సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 12.1 శాతం నిధులు కేటాయిస్తే కేంద్రం 1.3 శాతం మాత్రమే కేటాయించింది.
మధ్య తరగతికి ఊరట లేని బడ్జెట్
కేంద్ర పన్నుల ఆదాయంలో 10 శాతం పెరుగుదల నమోదైనప్పటికీ బడ్జెట్లో మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పు చేయనందున మధ్య తరగతి ప్రజల మిగులు ఆదాయం తగ్గిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఐటీ డిడక్షన్లలో మినహాయింపులు ఇవ్వాలి. ఒకే ఫారంతో ఐటీ రిటర్న్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలి.
ఎన్ఐడీకి నిధులు విడుదల: మిథున్ రెడ్డి, సత్యనారాయణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) నిర్మాణానికి రూ.100.38 కోట్ల బడ్జెట్ ఆమోదించగా.. సర్వే, సరిహద్దు గోడ నిర్మాణం వంటివాటికి రూ.0.70 కోట్లు వెచ్చించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ తెలిపారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీ అయిన నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి రూ.93.18 కోట్లు, యంత్రాలు, పరికరాలు, లైబ్రరీ పుస్తకాలకోసం ఎన్ఐడీ అహ్మదాబాద్కు రూ.6.50 కోట్లు విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, రెడ్డప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
ఏపీలో 66 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి నిధులు
ఉరవకొండ, ధర్మవరంలోని పుట్లమ్మ, మదనపల్లిలోని శ్రీ వివేకానంద సహా ఆంధ్రప్రదేశ్లోని 66 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి 201516 నుంచి 202122 మధ్య రూ.53.59 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. సమర్థ్ పథకం కింద యాడికికి చెందిన 40 మంది చేనేత కార్మికులకు స్కిల్ అప్గ్రేడేషన్ శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.
పీఎంకేకేకేవైకి రూ.421.02 కోట్లు ఖర్చు
ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన (పీఎంకేకేకేవై) కింద ఏపీలోని గనుల ప్రభావిత ప్రాంతాల్లో గతేడాది డిసెంబర్ వరకు కోవిడ్19 పనులతో కలిపి చేపట్టిన 16,149 ప్రాజెక్టులకు రూ.1,282.79 కోట్లు కేటాయించగా రూ.421.02 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు గురుమూర్తి, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబుగా కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
అదనపు రైల్వే శిక్షణ సంస్థ యోచన లేదు
ఆంధ్రప్రదేశ్లో అదనపు రైల్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ఆలోచనలేదని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు.
లిథియం లభ్యతపై సర్వే
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కడప జిల్లాల్లోని పర్నపల్లెలోపతనుతుల ప్రాంతంలో లిథియం సంభావ్యతను అంచనా వేయడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 202122 ఫీల్డ్ సీజన్లో ఒక జీ4 స్టేజ్ అన్వేషణ ప్రాజెక్ట్ను చేపట్టిందని కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం లోక్సభలో తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. మట్టి, ప్రవాహ అవక్షేపం, రాతిశిలల నమూనాల సేకరణతోపాటు స్కేల్ మ్యాపింగ్ చేపట్టనున్నట్లు చెప్పారు.
జూట్ పరిశ్రమను ఆదుకోండి
పర్యావరణ హితమైన జూట్ పరిశ్రమను ఆదుకోవాలని కేంద్రానికి వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దశల వారీగా తొలగిస్తామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని ఈ దశలో జూట్ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆచరణ సాధ్యంకాని పాలసీల వల్ల ఏలూరులోని వందేళ్లనాటి జూట్ మిల్లు మూత పడిందని తెలిపారు. జనపనారపై ఆధారపడిన లక్షలమందికి మద్దతిస్తారా లేదా అని ప్రశ్నించారు.
రైల్వేలైను ఖర్చు కేంద్రమే భరించాలి : మార్గాని భరత్రామ్
కోటిపల్లి నరసాపురం రైల్వేపనులకు సంబంధించి వందశాతం నిధులు కేంద్రమే భరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ భరత్రామ్ డిమాండ్ చేశారు. కోటిపల్లి నరసాపురం రైల్వేలైనుకు సంబంధించి ఆయన అనుబంధ ప్రశ్న అడుగుతూ.. రాష్ట్రానికి రెవెన్యూ లోటు కూడా పూడ్చని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైల్వేలైను నిధులు భరించాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి టీడీపీ ఎంపీలు తమతో కలిసి రావాలని కోరారు. దీనిపై కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రావ్సాబ్ ధాన్వే సమాధానమిస్తూ.. రాష్ట్ర విభజన అనంతరం ఏ రాష్ట్ర పరిధిలోని లైన్లు ఆ రాష్ట్రమే రాష్ట్ర వాటా భరించాలని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని పలు విధాలుగా కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్పై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిపై ప్రధాని రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వాలని ప్రధానికి, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి సహకరించాలని కోరారు. చంద్రబాబు వల్లే విభజన జరిగిందని, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి బతికి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు ఈబీసీ మహిళలకు కూడా ఆర్థికభరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, పారిశుధ్య కార్మికులకు నిధులు పెంచడంతోపాటు సక్రమంగా ఖర్చుచేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లు పెంచాలని, తద్వారా విద్యార్థుల ఆన్లైన్ తరగతులకు ఇబ్బందులు రావని పేర్కొన్నారు.
మేడిపండు బడ్జెట్ : గోరంట్ల మాధవ్
కేంద్ర బడ్జెట్ మేడిపండు చూడ.. అన్న సామెత మాదిరిగా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడుతూ సంతలో గొర్రెను అమ్మేసినట్లు చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేశారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలను ఆర్థికమంత్రి బడ్జెట్లో విస్మరించారని చెప్పారు. పదేళ్లలోగా రాష్ట్రంలో విద్యాసంస్థలు నెలకొల్పాల్సి ఉన్నా కేంద్రమే ఆ బాధ్యతకు దూరంగా ఉంటోందని విమర్శించారు. కేంద్రీయ వర్సిటీ, పెట్రోలియం వర్సిటీలకు కేటాయింపులు సరిపోవన్నారు. నదుల అనుసంధానాన్ని రాష్ట్రం స్వాగతిస్తోందని చెప్పారు. కానీ అంతర్రాష్ట్ర జలవివాదాల విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా అంశాన్ని ఇప్పటికైనా కేంద్రం నెరవేర్చాలని కోరారు.