అడుగడుగునా జన సంఘీభావం మధ్య వైయస్ జగన్ పర్యటన
విజయవాడ: విజయవాడ నుంచి వినుకొండకు వెళ్ళాలంటే సాధారణంగా పట్టే సమయం రెండు లేదా రెండున్నర గంటలు. కానీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్కు అందుకు దాదాపు రెట్టింపు సమయం పట్టింది. విజయవాడలో జోరు వానలో మొదలైన శ్రీ వైయస్ జగన్ పర్యటన.. అదే వానలో.. అశేష జనవాహిని, అభిమానుల తాకిడి మధ్య కొనసాగింది.
కారు దిగి మరో కారు:
మాజీ సీఎంకు కొత్తగా కేటాయించిన బులెట్ ప్రూఫ్ వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, మంగళగిరి వద్ద హైవేపై.. ఆయన పార్టీ నాయకుడికి చెందిన మరో వాహనంలోకి మారారు.
పోటెత్తిన అభిమానులు:
ఆ తర్వాత రూట్లో ప్రతి చోట పెద్ద ఎత్తున అభిమానులు సంఘీభావం ప్రకటిస్తూ తరలి రావడంతో, ఆయన వాహనాన్ని ఆపుతూ, అందరికీ అభివాదం చేస్తూ మందుకు కదిలారు. ఇక గుంటూరు, చిలకలూరిపేట, నర్సారావుపేట బైపాస్ రోడ్ల వద్ద అభిమానులు పోటెత్తడంతో, ఆయన ప్రయాణానికి బ్రేక్ పడింది. వర్షం కురుస్తున్నా అభిమానులు ఎక్కడా తగ్గలేదు.
పోలీసుల బ్రేక్లు:
మరోవైపు వైయస్ జగన్ పర్యటనకు పోలీసులు పదే పదే ఆటంకం కల్పించారు. దాదాపు 15 చోట్ల, ఆయన కాన్వాయ్లోని వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అతి పరిమిత సంఖ్యలో మాత్రమే వారు మాజీ సీఎం వెంట వాహనాలను అనుమతించారు. దీంతో శ్రీ వైయస్ జగన్ అభిమానుల్లో ఆగ్రహం వెల్లువెత్తింది.
జన సంద్రమైన వినుకొండ:
వైయస్ జగన్ రాకతో వినుకొండ జన సంద్రమైంది. గత బుధవారం రాత్రి, పట్టణంలో దారుణహత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ వినుకొండ వెళ్లారు. రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారిని ఓదార్చారు. ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.