కామ‘కూటమి’
అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం గక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలనే బెదిరించి.. బ్లాక్ మెయిల్ చేసి.. విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తుండటం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతేమిటంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించినట్లు బాధితురాలు స్వయంగా చెప్పిన వీడియో మంగళవారం ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసినా కూటమి పెద్దల నుంచి కనీస స్పందన లేదు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్.. ఇలా ఎంతో మంది దురాగతాలు బట్టబయలు కావడం కలకలం రేపింది. ఇక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఆగడాలు, మహిళలపై వేధింపులు తరచూ బయట పడుతూనే ఉన్నాయి.
స్థానిక నేత తనను మోసం చేశారంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం పోలీసు స్టేషన్లో పది రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేంత కఠినంగా చట్టాలు అమలు చేస్తామన్న ఆయా పార్టీల పెద్దలు.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఇలా మహిళలను దారుణంగా వేధిస్తున్నా.. బహిరంగ వీడియోల్లో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికినా.. బెదిరించి గర్భవతులను చేసి అబార్షన్లతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నా కనీసం కట్టడి చేయక పోవడంపై జనం నివ్వెరపోతున్నారు.

కిరణ్ రాయల్ వికృత చేష్టలు
తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్ వికృత చేష్టలు గత ఏడాది ఫిబ్రవరి 8న బాధిత మహిళ రిలీజ్ చేసిన వీడియో ద్వారా బయపడ్డాయి. తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన ఆమెతో కిరణ్రాయల్ చనువు పెంచుకుని డబ్బులు అడిగేవారని, కిరణ్ రాయల్కు అప్పులు చేసి మరీ రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత డబ్బులు అడిగితే రాయల్ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తరువాత కూటమి పెద్దలు ఆమెకు, కిరణ్ రాయల్ మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు.
ఆదిమూలం.. అరాచకం
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా కేవీబీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు. ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురిచేశారు. అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటకు వచ్చి చెప్పడంతో ఆయన అసలు రంగు బయటపడింది.
మంత్రి సుభాష్ అశ్లీల నృత్యాలు
సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన అశ్లీల నృత్యాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్ఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట ఇటీవల మ్యూజికల్ నైట్లు, డ్యాన్స్లు నిర్వహించారు. బుల్లితెర నటులు, జబర్దస్త్లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్ పండగ మూడు రోజులూ పలు పాటలకు అసభ్యంగా చిందులు వేశారు. ఈ వీడియోలు సామాజికమాధ్యమాల్లో చక్కెర్లుకొట్టడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా మంత్రి తన నృత్యాలను సమర్థించుకున్నారు. ‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’ అంటూ వింత వాదనకు దిగారు.
కూన రవి వేధింపులకు దళిత ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య గతేడాది ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. అంతకు ముందు ఆమె శ్రీకాకుళం తిలక్నగర్లోని తన నివాస గృహంలో ఓ ఎల్రక్టానిక్ మీడియాకు రవి వేధింపులపై ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం తన గదిలోకి వెళ్లి బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మాట్లాడుతూ.. పక్కకు తూలిపోవడంతో ఆమెను వెంటనే రిమ్స్కు తరలించారు. వైద్యులు 48 గంటల పర్యవేక్షణలో ఉంచారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకీ దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలేవి?
ఈవ్ టీజింగ్కు పాల్పడేవారిని, ఆడపిల్లలను అభద్రతా భావానికి గురిచేసే వారిని పది మంది చూస్తుండగా వాతలు తేలిపోయే బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలు రావాలని కూటమి పెద్దలు పలు సందర్భాల్లో చెప్పారు. అధికారంలో లేనప్పుడైతే.. తమకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని, రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారంటూ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు వారే ప్రభుత్వ పెద్దలుగా కొనసాగుతుండడంతో పాటు కేంద్రంలోని ఎన్డీఏలో మిత్రపక్షంగానూ ఉన్నారు. మరి రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతల అఘాయిత్యాలు, కీచక పర్వాలపై నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం లేదా? లేదంటే తెలిసీ మౌనంగా ఉన్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కాగా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరలో ఐదుసార్లు గర్భవతిని చేసి, అబార్షన్లు చేయించారన్న బాధితురాలి వీడియో వెలుగులోకి రావడానికి ముందు కూటమి పెద్దల్లో ఒకరు విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. కొందరి వివాహేతర సంబంధాలను పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు. తద్వారా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై వారికి ముందుగానే సమాచారం ఉందా? అని విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాధితురాలిపైనే ఎదురు దాడికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు
నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు
రైల్వేకోడూరు శాసన సభ్యుడి రోత లీలలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేసిన బాధితురాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకుని బలాత్కారానికి పాల్పడ్డారు..
వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సార్లు అబార్షన్ చేయించారు..
ఎవరికైనా చెబితే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు
రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న అకృత్యాలు, అరాచకాలతో సామాన్యులకు, ముఖ్యంగా మహిళల భద్రతకు దిక్కులేకుండా పోయింది. సాక్షాత్తూ కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులే కీచకులుగా మారిపోయి పశువుల మాదిరిగా బరి తెగించి మహిళలపై నిర్భీతిగా లైంగిక దాడులకు తెగబడటం నివ్వెరపరుస్తోంది. తాజాగా తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం సర్వత్రా కలకలం రేపుతోంది.
బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామ పిశాచిలా మారిపోయి ఓ వివాహితను దారుణంగా వేధించి దౌర్జన్యాలకు తెగబడటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు ఇక తట్టుకోలేక ఈ దారుణాన్ని సెల్ఫీ వీడియో ద్వారా మంగళవారం బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో జరిపిన నికృష్టమైన చాటింగ్లు, అసహ్యం పుట్టించే నగ్న వీడియోలను సాక్ష్యాధారాలుగా చూపించారు. ఈ కీచక పర్వంపై బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇవీ..
జుట్టు పట్టుకుని కొట్టి.. కారులో రేప్ చేశారు!
నేను రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నా. ఎన్నికల అనంతరం 2024 జూన్ 14న స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు అభినందనలు తెలుపుతూ ఫేస్బుక్ ద్వారా ఓ మెసేజ్ పెట్టా. టెలిగ్రామ్ యాప్లో మాట్లాడదామంటూ ఆయన నాకు అందులో మళ్లీ మెసేజ్ చేశారు. నా గురించి వివరాలు తెలుసుకున్నారు. నా ఫోన్ నెంబర్ తీసుకుని, ఆయన నెంబర్ నాకు ఇచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, నువ్వు ఒంటరివి కాదు.. నీకు నేనున్నానంటూ హామీ ఇచ్చారు.
మొదటి రోజే రెండు మూడు గంటలు పాటు మాట్లాడారు. రెండు రోజులకే వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని (న్యూడ్స్) నన్ను అడిగారు. అది కరెక్ట్ కాదని చెప్పినా వినకుండా బెదిరించి, బలవంతం చేశారు. నువ్వొక చిన్న ఉద్యోగివి.. నీమీద ఎంక్వైరీ వేస్తాం.. నీ కుమారుడితో ఒంటరిగా ఉంటున్నావు.. నీ కుమారుడికి ఏమైనా అయితే తరువాత నన్ను అడగొద్దు.. జాగ్రత్త! అంటూ భయపెట్టారు.
నీ భవిష్యత్తు నాశనం కాకూడదంటే నన్ను కలిసి తీరాల్సిందేనని హెచ్చరించారు. దీంతో నేరుగా కలసి ఆయనకు అర్థం అయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో 2024 జూలై 9న మొదటిసారి కలిశా. మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కారులో తీసుకెళ్లారు. కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి నన్ను లైంగికంగా వేధించారు.
నేను వద్దంటూ వారించి, విడిపించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, కారు డోర్ తెరిచి తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. నేను అరుస్తుంటే జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత మళ్లీ మళ్లీ నన్ను కలుస్తూనే ఉన్నారు.

ఐదుసార్లు గర్భం తీయించారు..
ఆగస్టులో నాకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని చెప్పారు. రెండు మూడు రోజులు బెదిరించిన తరువాత నా భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. రెండు నెలలు వరకూ అబార్షన్ చేయించుకోకపోవడంతో ఇంటికి వచ్చి నన్ను బాగా కొట్టేవారు. ఆ తరువాత అబార్షన్ చేయించుకున్నా. అలా ఏడాదిన్నరలో ఐదుసార్లు అబార్షన్ చేయించారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా బయటకు తీసుకువెళ్లడం లేదా ఇంటికి వచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు.
నేను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడే ఉండేవారు. అంతేకాకుండా నా భర్త, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేశారు. నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అందరూ నా నుంచి దూరమైపోయారు. నా బిడ్డ కూడా గత ఆరు నెలలుగా నాతో లేడు.
ఇలా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత.. నన్ను పెళ్లి చేసుకోవడం కుదరని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ఏడాదిన్నరగా నన్ను వేధించి, వాడుకుని ఇప్పుడు వదిలేస్తానంటున్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో కాల్ చేయాలనేవారు. నన్ను నగ్నంగా చూడాలనేవారు. నాతోనే కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలా మంది మహిళలను వేధించారు. నాకు న్యాయం కావాలి!