మనం కట్టేవి 'ఊళ్లు'

8 Dec, 2020 08:21 IST

అమరావతి: మనం పేదల కోసం కట్టేవి ఇళ్లే కావు ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి  స్పష్టం చేశారు. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలని, వీధి దీపాల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటుచేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అలాగే ప్రతి లే అవుట్‌లో నమూనా ఇంటిని (మోడల్‌ హౌస్‌) నిర్మించాలని ఆదేశించారు. ఈ నెల 25వ తేదీన పట్టాలు ఇచ్చే ప్రాంతాల్లో తొలిదశ కింద అదే రోజు 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని, జనవరి 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని చెప్పారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ జగన్‌ ఏమన్నారంటే...
 

లబ్ధిదారులు ఎలా కోరుకుంటే అలా..
– లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే కట్టించి ఇస్తాం
– లేదా మెటీరియల్‌ ఇచ్చి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించిన డబ్బు ఇవ్వండి అంటే అలాగే చేస్తాం
– లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇల్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు.
– ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి
– ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. నాణ్యత చాలా ముఖ్యం
–ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలి.
–ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలి.
–ఆ లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్‌ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధంగా ఉంచుకోవాలి.
–దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఇళ్ల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుంది
– ఇటీవలి వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలి
–అవసరమైన విధంగా డ్రెయిన్ల నిర్మాణం, తదితర చర్యలు తీసుకోవాలి
–లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా, సమస్యలు లేకుండా చూడాలి.


– మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు
– 3,65,987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులు
– ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ
– రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ
– 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభం
–రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం
–వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక
– కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం.
– టిడ్కో ఇళ్లకు సంబంధించి 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం
– 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కేవలం రూ.1 కే ఇవ్వనున్న ప్రభుత్వం