అసెంబ్లీ దగ్గర బయట పడ్డ అసలు రంగు

17 Dec, 2015 18:11 IST

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మహిళా లోకం తల్లడిల్లిపోతున్న పరిస్థితి. కాల్ మనీ పేరుతో కొందరు దుర్మార్గులు చేస్తున్న అరాచకాల్ని తలచుకొంటేనే చాలా ఆవేదన కలుగుతుంది. ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి, వాటిని తీర్చలేకపోయినప్పుడు ఆ కుటుంబాన్ని వేధించటం పరిపాటి. అప్పుడు అప్పులు తీర్చలేని కుటుంబాల్లోని మహిళల్ని వేధించి, వారిని వ్యభిచార కూపంలోకి లాగటం, నీలి చిత్రాలు చిత్రించి బ్లాక్ మెయిల్ చేయటం అన్న నేరాలు అత్యంత హేయమైన చర్యలు. ఇటువంటి వాటి మీద తెలుగు నేల మీద అంతా నిప్పులు కక్కుతున్నారు.

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఈ అంశం మీద నిరసన తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో పాదయాత్రగా అసెంబ్లీ కి తరలి వచ్చారు. తర్వాత అసెంబ్లీ దగ్గర తమ గళాన్ని వినిపించారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నించడం దుర్మార్గమని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయ పడ్డారు.  విజయవాడకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. సెక్స్ రాకెట్ హీరోతో చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన కార్యకర్తలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని రోజా  మండిపడ్డారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు చెప్పుకొని కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూడడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. మహిళకు ఎంతో గౌరవం ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని ఆమె అన్నారు. కాల్‌మనీ ముసుగులో టీడీపీ సెక్స్  రాకెట్ నడుపుతున్న తీరు దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసుపై చర్చకు డిమాండ్ చేస్తే స్పీకర్ తిరస్కరించడం బాధాకరమన్నారు.

ఒక వైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కి చెందిన మహిళలు ఈ విధంగా డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. కనీసం జరిగిన దురాగతాన్ని ఖండించే ప్రయత్నం చేయటం లేదు. సాటి మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల సానుభూతి ప్రకటించే ప్రయత్నం కూడా చేయలేదు. నోరు విప్పితే చంద్రబాబు కి ఎక్కడ కోపం వస్తుందో అని మౌనం పాటిస్తున్నారు. రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దిగజారిపోయినా ఫర్వాలేదు, కానీ చంద్రబాబు ఆశీస్సులు ఉంటే చాలని స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు.