రైతుల తరపున తీవ్రంగా పోరాడిన వైఎస్సార్సీపీబలవంతపు భూ సేకరణ ను వ్యతిరేకించిన పార్టీ
వెనక్కి తగ్గిన చంద్రబాబు ప్రభుత్వం
హైదరాబాద్: రైతుల తరపున వైఎస్సార్సీపీ చేసిన పోరాటం ఫలించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో చేసిన ఆందోళనలు, ఉద్యమాలకు ప్రభుత్వం దిగి వచ్చింది. భూ సేకరణ నుంచి వెనక్కి తగ్గింది.
పోరాట మార్గం
రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు లాక్కొనేందుకు ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యాలు వంటి రక రకాల మార్గాల్ని ఎంచుకొంది. భూములు ఇవ్వమన్న చోట పచ్చ చొక్కాల గూండాలు పంట పొలాల్ని తగల బెట్టారు. ఈ దశలో రైతుల పక్షాన పోరాడి ఉద్యమించింది వైఎస్సార్సీపీనే. రైతులకు అండగా అనేక పర్యాయాలు పార్టీ నాయకులు అక్కడ పర్యటించారు. పదే పదే రైతుల తరపున ఉద్యమాన్ని నడిపించారు.
స్వయంగా పోరు సలిపిన జన నేత
రైతుల పక్షాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్వయంగా పోరుసలిపారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. రాజధాని ప్రాంతంలోని ప్రదాన పట్టణమైన మంగళగిరిలో జగన్ దీక్ష చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగిన సమర దీక్షకు రైతులు వేల సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం మొండిగా భూ సేకరణకు నోటిఫికేషన్ వేయటంతో వైఎస్సార్ సీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. మొన్న 26వ తేదీన వైఎస్ జగన్ స్వయంగా విజయవాడలో ధర్నా చేపట్టారు.
దిక్కు తోచని ప్రభుత్వం
వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం నానాటికీ తీవ్రం కావటంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటం, అటు చట్ట బద్దత లేకుండా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయటం వంటి అంశాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అసెంబ్లీ లో వైఎస్ జగన్ ప్రశ్నల్ని తట్టుకోవటం కష్టమని భావించిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. భూ సేకరణ నుంచి తప్పుకొని భూ సమీకరణ వైపు అడుగులు వేస్తోంది.