కీచక పాలన అంతం కావాలి

3 Jul, 2018 16:51 IST

ఇన్నాళ్లకు చంద్రబాబు తన పాలనలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ఒప్పుకున్నారు. మహిళలపై నేరాల్లో ఎపి ప్రపంచంలోనే ముందు ఉండటం దురదృష్టకరం అని తెగ మదన పడిపోతున్నారు. ఆయన కన్నీరు కార్చినంత మాత్రాన జరుగుతున్న అకృత్యాలు ఆగిపోతాయా? స్వయంగా ఆయన పార్టీ నేతలే మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడ్డా చంద్రబాబు కిమ్మనలేదు. మహిళా అధికారలపై దాడులు చేసిన నాయకులను వెనకేసుకొచ్చారు. పంచాయితీ చేసి మరీ కేసులు పెట్టకుండా కాపాడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ వేధింపులు, దాడుల సంఘటనలు వెలుగు చూస్తున్నా, చంద్రబాబు కనీసం వాటిపై విచారణకు కూడా ఆదేశించింది లేదు. మారుమూల పల్లైనా, నగరంలో అయినా మహిళలకు భరోసా లేకుండా పోయింది. ‘ఆయనొస్తున్నాడు-ఇక భయం లేదు’ అంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేయించుకున్నాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఎల్లో పార్టీ నేతలు కనబడితే చాలు, కీచకులను చూసినట్టు బెంబేలు పడుతున్నారు ప్రజలు. అధికారం ఉందనే అహంకారంతో, పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. వేధింపులు, హింస, దాడులు, హత్యలకు తెగబడటం…పచ్చ పార్టీ నేతలే పైశాచిక ప్రవర్తనతో కన్నూ మిన్నూ గానక తిరుగుతున్నారు.

ఆడపడుచులు అంటూ అన్నగారు అభిమానంగా పిలుచుకున్న రాష్ట్రంలో మహిళలకు రక్షణే లేకుండా పోయింది. అక్కచెల్లెమ్మలని మహానేత ముచ్చటగా చూసిన రాష్ట్రంలో నేడు రావణుల పాలన సాగుతోంది. అత్యాచారాల కేసులు పెరుగుతున్నాయి. కానీ బాధితులకు న్యాయం దక్కడం లేదు. మహిళలపై దాడులు జరిగిన ఘటనల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంటే చాలు, పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఇక దళిత మహిళలను అవమానించి, అత్యంత అమానవీయంగా కొట్టిన సంఘటనలు కోకొల్లలు. గిరిజన మహిళలను సైతం జుట్టు పట్టుకు ఈడ్చిన చరిత్ర చంద్రబాబు పాలనలోనే చూడగలం. ఇన్ని సంఘటనల గురించి ప్రజలకు తెలుస్తోంది, కానీ ఆ బాధితులకు ఏం న్యాయం జరిగింది అనే విషయం మాత్రం తెలియరావడం లేదు.

అక్రమ రవాణా, సెక్స్ రాకెట్లు, విదేశాల్లో సెక్సు కుంభకోణాల్లో అంతా పచ్చపార్టీ నేతల పేర్లే బయట పడుతున్నాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నా చంద్రబాబు కనీసం విచారణ సంస్థలను దర్యాప్తుకు ఆదేశించపోవడం ఆ ఆపార్టీ అరాచకత్వానికి పరాకాష్ట అనుకోవాలి. రైతులకు రుణమాఫీ కోసం కమిటీలు వేసి, హామీల అమలు కోసం కమీషన్లు ఏర్పరిచి కాళం వెళ్లబుచ్చినట్టే, నేరం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం అనే మాటలతో బాబు ఇన్నాళ్లుగా కాలక్షేపం చేస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇన్ని వందల సంఘటనల్లో ఒక్కరికైనా న్యాయం దక్కిందా అంటే లేదనే చెప్పాలి.

ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నెత్తీ నోరు కొట్టుకుని మరీ చెబుతున్నాయి రాష్ట్రంలో మహిళల దుస్థితి గురించి. అయినా ఎప్పుడూ నోరు మెదపని బాబు నేడు మహిళలపై అరాచకాల గురించి తెగ వగస్తున్నట్టు పోజు కొట్టడం చూస్తే ఎవ్వరికైనా ఆగ్రహం కలుగుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అసలేం తెలియనట్టు నంగనాచి నాటకం ఆడటంలో చంద్రబాబు దిట్ట అని ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు తెలియజేస్తున్నారు. నేరాల చిట్టాలు, దారుణాల జాబితాలు బైటకు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత చందంగా ఉన్నాయో లెక్కలతో సహా వివరంగా తెలుస్తున్నాయి. అందుకే చంద్రబాబు ఈ విషయాన్ని బైట పెడుతూ ఎంతో చింతిస్తున్నట్టు నటిస్తున్నాడు. ఓ ముఖ్యమంత్రిగా, బాధ్యత గల నాయకుడిగా ఒక్క కేసులో అయినా బాధితుల పక్షాన నిలబడి, వారికి న్యాయం చేసి ఉంటే చంద్రబాబు మాటలను నేడు ప్రజలు నమ్మే వారు. మహిళలు విశ్వసించేవారు. అమ్మాయికి ముద్దు పెట్టాలి లేక కడుపైనా చేయాలి అంటూ బాలకృష్ణ నీచంగా మాట్లాడినప్పుడు కనీసం ఖండించైనా ఉండాలి. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అంటూ ముఖ్యమంత్రే లింగవివక్షను ప్రోత్సహిస్తున్న రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెచ్చు మీరడంలో ఆశ్చర్యం లేదు. అందుకే నేడు రాష్ట్ర మహిళలంతా ఒకటే కోరుతున్నారు – బాబు కీచక పాలన అంతం కావాలి. మహిళలకు రక్షణ కావాలి.