తెలుగు తమ్ముళ్ల టెంపర్

12 May, 2018 14:17 IST

టిడిపి నేతలకు నోటి దురుసు ఎక్కువ. కార్యకర్తలకు చేతి దురుసు మక్కువ. ఒకేరోజు జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు ఈ విషయాలను రూఢీ చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మీద ఒంటికాలిమీద లేచే టిడిపి నేత, ప్రస్తుత ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, కులం పేరుతో దూషిస్తూ తన అహంకారాన్ని అందరి ముందూ బైటపెట్టిన ఘటన ఒకటైతే, బిజెపి జాతీయ అధ్యక్షుడి కాన్వాయ్ మీద రాళ్లు రువ్వి అల్లర్లు చేసిన ఘటన మరొకటి.

 సొంత సామాజిక వర్గాన్నే చులకన చేసిన వర్ల

వర్ల రామయ్య. ఎస్సీ అయ్యుండీ, ఆ రిజర్వేషన్ తో ఎదిగిన వ్యక్తి అయ్యుండీ సాటి సామాజిక వర్గానికే చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించాడు. మచిలీపట్నం బస్ డిపోలో ఆకస్మిక తనిఖీకి వచ్చిన ఆయన, బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడిని కులం పేరుతో దూషించాడు. చెవులో ఇయర్ ఫోన్లతో పాటలు వింటూ, వర్లను పట్టించుకోకపోవడంతో ఆయన అహం దెబ్బతింది. నీదే కులం, నీ అమ్మా, అయ్యలేం చేస్తుంటారంటూ గద్దించారు. మా కులం మాదిగ అని, తండ్రి పెయింటరని చెప్పిన ఆ వ్యక్తిని కులం పేరుతో తిడుతూ, మాదిగలు చదువుకోరని ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. టిడిపి నేతలకు దళితులను అవమానించడం పరిపాటి అయ్యింది. గతంలోనూ ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు ముఖ్యమంత్రికి కూడా ఈ విషయంలో మినహాయింపులో లేరు.

టిడిపి కార్యకర్తల గూండా గిరి

బిజెపితో నిన్నటిదాకా పూసుకు తిరిగిన వాల్లే పచ్చతమ్ముళ్లు. మోదీయే దేశానికి దిశా నిర్దేశం అని ప్రచారాలు చేసారు. మోదీ చంద్రబాబుని పొగిడితే ఉప్పొంగిపోయారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను ఆ పార్టీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టేశారు. ప్రతిపక్షం నేడు పోరాటం చేస్తూ, ప్రజలను కేంద్రానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏకం చేస్తుంటే దిక్కులేక, దారి తోచక కేంద్రం తో తెగతెంపులు చేసుకున్నారు. అవసరం తీరిపోయాక అడ్డాకును విసిరినట్టు విసిరి, నేడు ఆ పార్టీ ప్రధాన నేత రాగానే, కాన్వాయిల మీద రాళ్లు రువ్వారు. బాబు కరివేపాకు సిద్ధాంతం, అవసరం తీరిపోయాక తిలోదకాలిచ్చే సంస్కృతి ఆ పార్టీ మొత్తం జీర్ణం చేసుకున్నట్టుంది.  2014 ఎన్నికల ముందు మోదీ ఎపిలో అడుగుపెడితే కాల్చేస్తాన్న ముఖ్యమంత్రి నేడు, కేంద్రంపై కేసులు పెడతా అన్నారు. నిన్నటిదాకా బిజెపి టిడిపి భాయిభాయి అనుకున్న కార్యకర్తలు బాబు చూపిన బాటలో హింసలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో చేసే రావణ కాష్టం చాలక, పొరుగునున్న కర్ణాటకలోనూ కొరివి పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్రంలోకి అడుగుపెట్టి, అందులోనూ తిరుపతిలో వేంకటేశ్వరుని దర్శించుకుని వెళుతున్న బిజెపి అగ్రనేత మీద రాళ్లు రువ్వించడం తెగతెంపులు అయిన బిజెపి మీద ఉక్రోషం చూపించుకోడానికే. ఎందుకంటే బాబు ఓటుకు నోటు కేసు తోసుకు వస్తుండటం, విచారణ ముందుకు సాగుతుండటం, త్వరలో విచారణ సంస్థలు బాబు సీటు దాకా రాబోతున్నాయంటూ బిజెపి నేతలు హెచ్చరికలు చేస్తుండటమే బాబు అసహనానికి కారణం.

బాబు తెంపరితనం

నేనేసే రోడ్ల మీద నడవద్దని ప్రజల మీద అక్కసు చూపించాడు. నాకు కాకపోతే ఓట్లు ఎవరికేస్తారని వాదించాడు. పదేళ్ల ఉమ్మడి రాజధానిలో పక్కపార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా నాకూ ఎసిబి ఉందంటూ రంకెలేసాడు. నా ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారని ఉడుక్కున్నాడు. నేడు పాపం పండి అవినీతి విచారణ జరగుతుందని అనగానే నామీద కుట్రలు పన్నుతున్నారని తేలుకుట్టిన దొంగలా వాపోతున్నాడు. పోలవరం టెండర్ల గురించి, పట్టిసీమ కమీషన్ల గురించి, రాజధాని నిధుల గురించి, భూసేకరణలో లొసుగుల గురించి, ఓటుకునోటు కేసు గురించి ఇలా…బాబు చేసిన యవ్వారాల గురించి బిజెపి పదే పదే ప్రశ్నిస్తుండటంతో బాబుకు ఉక్రోషం ముంచుకొచ్చింది. అందుకే అమిత్ షా కాన్వాయి పైకి తన పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పాడంటూ కమలం పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. బాబు తెంపరితనానికి త్వరలో మూల్యం చెల్లించుకుంటాడంటున్నారు.

తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. ముఖ్యమంత్రి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకూ భవిష్యత్ లో ఓటమి బెంగ తో ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో పడిపోతున్నారు. పై స్థాయి నేతల నోటికి అదుపుండటం లేదు, అనుచరుల పనులకు అడ్డుండటం లేదు, ప్రభుత్వాధినేత మాటలకు విలువుండటం లేదు…ఇదీ నేటి రాష్ట్ర పరిస్థితి.