ఎంపీల రాజీనామాలపై టీడీపీ రాజకీయం

6 Jun, 2018 10:29 IST

ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పిలు రాజీనామాలు చేసారు. ఈ రాజీనామాల ఆమోదం గురించి చంద్రబాబు ఇంకా ఆ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లు నిజంగా వింతగా ఉన్నాయి. హోదా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండి, ప్రతిపక్ష పార్టీ ఎంపీలంతా రాజీనామాలకు సిద్ధమై, ప్రభుత్వాన్ని కూడా కలిసి రమ్మని పిలుపు ఇచ్చాయ్. మొత్తం25 మంది ఎంపీలు కలిసి రాజీనామాలు చేస్తే, నిరాహారదీక్షకు పూనుకుంటే కేంద్రం దిగిరాక తప్పదని, రాష్ట్రం కోసం ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి కేంద్రంతో పోరాడదామని పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్. కానీ చంద్రబాబు, ఆయన ఎంపీలు తుపాకి తూటాకు దొరక్కుండా ఢిల్లీనుంచి పారిపోయారు. రాజీనామాల గురించి నోరెత్తకుండా మిన్నకుండిపోయారు. అలాంటి అధికార కాంక్ష ఉన్న టిడిపి నేతలు వైఎస్సార్ సీపి ఎంపిల రాజీనామాల గురించి ఎద్దేవా చేయడం హాస్యాస్పదమే. వారికి నైతికత అనేది ఏ కొశానా ఉన్నా ఇలాంటి విమర్శలకు సిద్ధపడరు. నైతికత, న్యాయం, ధర్మం అనే పదాలకు ఆమడ దూరంలో ఉంటారు కనుకే అవిశ్వాసంలోనూ, రాజీనామాల్లోనూ చంద్రబాబు ఆయన ఎంపిలు వెనకడుగు వేశారు.

ఇప్పటికే ఎన్నోసార్లు స్పీకర్ ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీల రాజీనామాలను తక్షణం ఆమోదించారు కనుక, తమ రాజీనామాలను కూడా అంగీకరించమని కోరేందుకు ఎపి ప్రతిపక్షపార్టీ ఎంపీలు బుధవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలవనున్నారు. ఇది పార్టీ నిబద్ధతకు సంబంధించిన విషయం అని, ఎంపీలు, ఇంకాప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైతికతకు ఆధారం అని వారంటున్నారు.

బాబు డాంబికాలు

వైఎస్సార్ సిపి ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకుని ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేసిన చంద్రబాబు  హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు ఎందుకు చేయించలేదో వివరణ ఇవ్వాల్సింది. 23 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపిలను సంతలో పశువుల్లా కొన్న చంద్రబాబు నైతిక విలువల గురించి మాట్టాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పక్క పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేసి, వారితో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవులిచ్చి మరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల చిత్తశుద్ధి గురించి ప్రశ్నించే అర్హతే లేదని అన్నారు ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్. ప్రతి రాజకీయ పరిణామాన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడమే చంద్రబాబు40 ఏళ్ల అనుభవమని, కర్ణాటక ఫలితాలను కూడా బాబు అలాగే మలుచుకుంటున్నాడని విమర్శించారు.

స్పీకర్ మాటలు గుర్తులేవా

గత నెల29వ తేదీన తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసారు. ప్రత్యేక హోదా పై భావోద్వేగాల కారణంగా ఎంపీలు రాజీనామాలు చేస్తున్నట్టు భావిస్తున్నానని, మరోసారి ఆలోచించుకోవాలని చెప్పి పంపారు స్పీకర్. మరోసారి కూడా ఎంపీలు రాజీనామాలకే పట్టు పడితే ఆమోదించక తప్పదని కూడా అదే రోజు ఆమె ప్రకటించారు. పార్లమెంట్ సమావేశల చివరి రోజే స్పీకర్ ఫార్మెట్ లో ఎంపీలు రాజీనామాలను సమర్పించేశారు. 

విచక్షణాధికారాలతో విలువలకు పాతర

స్పీకర్ కు కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి. కానీ ఆ అధికారాలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే పనిచేస్తున్నాయన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ సందర్భాల్లో నిరూపితం అయ్యింది. ఎపి తెలంగాణాల్లో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి. రెండు చోట్లా స్పీకర్లు తమ విచక్షణాధికారాలు ఉపయోగించి ఫిరాయింపు దార్లపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. ఈ విషయంలో కోర్టులకు వెళ్లినా స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకునే అవకాశం న్యాయాస్థానాలకు లేదు అంటూ అధికార పార్టీలు వాదించాయి. రాష్ట్రాల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే కేంద్రంలో ఇంకెలా ఉంటాయో సులువుగానే ఊహించవచ్చు. పైకి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్టు నటిస్తూ, లోపల కేంద్రానికి అనుకూల విధానాలు అనుసరిస్తున్న టిడిపికి మేలు చేసేలాగే కేంద్రం వ్యవహరిస్తోంది. ఎపి ప్రతిపక్ష ఎంపీల రాజీనామాల ఆమోదానికి జాప్యం వెనుక ఉన్న రహస్యం ఇదే కావచ్చు. చంద్రబాబు సర్కార్ ఎపిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ఎంపీల రాజీనామాలపై విమర్శలు చేసేందుకు వీలుగా కేంద్రం సహకారం అందిస్తుండటమే దీనికి నిదర్శనం. బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు అంటూ ఎప్పటి నుంచో బాబు సర్కార్ అబద్ధ ప్రచారాలు చేస్తోంది. స్పష్టంగా వీటిని ఖండిస్తున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్. కానీ ఈ విషయంలో ప్రజలను మభ్యపెట్టేందుకే కేంద్రం, రాష్ట్రం కలిసే రాజీనామాల ఆమోదాన్ని తాత్సారం చేయించడం, తద్వారా ప్రతిపక్ష పార్టీ ఎంపిల నిజాయితీ, నిబద్ధతలపై ప్రజల్లోఅనుమానాలు రేకెత్తించడం వారి ఉద్దేశ్యం. అందుకే నెల్లాళ్ల తర్వాత చంద్రబాబు రాజీనామాల ఆమోదం మాటను ముందుకు తెచ్చారు. ఉప ఎన్నికలంటూ సవాళ్లు విసురుతున్నారు.